మొయినాబాద్ : దశాబ్దాల కల నేరవేరనుండటంతో చిన్న మంగళారం, శంకర్పల్లి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర పాలనలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నెరవేరని కల తెలంగాణ రాష్ర్టం సిద్ధించకా సీఎం కేసీఆర్ పాలనలో వంతెన నిర్మాణానికి శుభం కార్డు పడింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో మండల పరిధిలోని చిన్నమంగళారం శంకర్పల్లి మండల పరిధిలోని గోపులారం గ్రామాల మధ్య ఉన్న మూసీ నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. దీంతో చిన్నమంగళారం సర్పంచ్ సుకన్య, ఎంపీటీసీ బట్టు మల్లేశ్, ఉపసర్పంచ్ బేగరి గోపాల్, గ్రామస్తులు ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నమంగళారం సమీపంలో ఉన్న మూసీ నది వలన ఇరు మండలాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. సీమాంధ్ర ప్రభుత్వాలకు మండలాల ప్రజలు వంతెన నిర్మాణం కోసం మొరపెట్టుకున్న పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం అడిగిన వెంటనే వంతెన నిర్మాణానికి రూ. 5కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ వంతెన నిర్మాణ పనులు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా నక్కలపల్లి-హైతాబాద్ గ్రామాల మధ్య ఉన్న ఈసీ వాగుపై వంతెన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. చిలుకూరు నుంచి సురంగల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ. 5కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు హరిశంకర్గౌడ్, బేగరి రాములు, విష్ణుగౌడ్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.