మొయినాబాద్ : ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపాధి లేని వారు వ్యాపార రంగంలో రాణించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ముదిగొండ అనిత, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ శ్రీహరియాదవ్ నూతనంగా ఏర్పాటు చేసిన కన్వెషన్హాల్ను బుధవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వివాహాలు, విందులు, ఇంటి ముందు జరుపుకునే వారని అన్నారు. కాని నగరానికి అనుకుని ఉన్న గ్రామాలు కూడా దినదినం పట్టణీకరణ రూపుదిద్దుకుంటుందన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు ఇంటి వద్ద వివాహలు, విందులు చేసే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. కావున ప్రజల అవసరాలను బట్టి కళ్యాణ మండపాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సాధారణ కళ్యాణ మండపాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎసీ కల్యాణ మండపాలు కూడా అందుబాటులోనికి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీలు అనంతరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.