షాబాద్ : న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని రాజేంద్రనగర్ న్యాయమూర్తులు రుబినాఫాతిమా, సుచిత్రలు తెలిపారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామంలో రాజేంద్రనగర్ కోర్టు బార్ కౌన్సిల్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ ప్రవీణ్కుమార్ అధ్యక్షతన న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, విద్యార్థులు ఎవరైనా తమని వేధిస్తే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలా కాని పక్షంలో కోర్టును ఆశ్రయించాలన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఫిర్యాదు దారుల పేర్లను గోప్యంగా ఉంచాలని ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పెండ్లిలో కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టపరమైన నేరమని, అలాంటి వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మహిళలు, విద్యార్థులు బయటి వ్యక్తులు నిర్వహించే ప్రచారాలను నమ్మి మోసపోవద్దన్నారు.
అనాథ పిల్లలతో పాటు వృద్ధులకు అండగా ఉచిత న్యాయ సేవలను అందించేందుకు న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడు ముందుంటుందని చెప్పారు. మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కమిటీ ఏర్పాటు చేసి పేదవారికి ఉచితంగా న్యాయ సలహాలను, కోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయ వాదులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూర్గు రవళి, సీఐ రాజు, ఎస్ఐలు జగదీశ్వర్, నారాయణసింగ్, బార్ అసోసియెషన్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ ప్రవీణ్కుమార్, జ్ఞానేశ్వర్చారి, ఎంపీటీసీ రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ నాగార్జున, మాజీ సర్పంచ్ నర్సింహరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.