యాచారం : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్నెడ్డి అన్నారు. మండలంలోని నందివనపర్తిలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విగ్రహానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ సభ్యులు అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా యాదగిరిగుట్టను యాదాద్రి ఆలయంగా అద్బుతంగా పునర్మించినట్లు పేర్కొన్నారు. నందివనపర్తి గ్రామం సకల దేవాలయాలకు నిలయం కావడంతో ఎంతో ఆధ్యాత్మికత సంతరించుకుందన్నారు. గ్రామంలో అతి పురాతన దేవాలయాలున్నాయని వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, సర్పంచ్ ఉదయశ్రీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, బీఎన్రెడ్డి ట్రస్టు చైర్మన్ బిలకంటి శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, జోగిరెడ్డి, గోపాల్, గణేష్నాయక్, రమేశ్, శేఖర్, వార్డు సభ్యులు, గౌడసంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.