షాబాద్, నవంబర్ 6 : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదారాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు వేగంగా అడుగులు పడ్డాయి. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి జరుగనున్నది. 46 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం కానుంది. ఇప్పటివరకు రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలు తొలగిపోయాయి. సోమవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ వెల్లడించిన తీర్పులో భాగంగా ఈమేరకు నిర్మాణాన్ని తలపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దానిపై అభ్యంతరాలు లేవనెత్తినా వాటిని పూర్తిగా తోసిపుచ్చింది.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. ఈ నెలాఖరులో పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.928.41 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రహదారి విస్తరణ నిమిత్తం 350 ఎకరాల మేర భూములను సేకరించారు. రహదారి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్పాస్ బ్రిడ్జిలను కూడా నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించారు. మొత్తంగా ఆరు భారీ, ఎనిమిది చిన్న అండర్పాస్ బ్రిడ్జిలతో పాటు బైపాస్ రోడ్లనూ నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో మొయినాబాద్, చేవెళ్ల వద్ద బైపాస్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే అంగడిచిట్టంపల్లి వద్ద 12 లైన్ల టోల్ప్లాజాను ఏర్పాటు చేయనున్నారు.
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు వేగంగా చేపట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు షురూ చేయడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. బీజాపూర్ జాతీయ రహదారి వెళ్లే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్లుగా నిర్మించనున్నారు.
ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతోపాటు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో నిర్మాణం చేపట్టేందుకు జాతీయ రహదారుల శాఖ సమాయత్తమవుతున్నది. అదే విధంగా భూ సేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసే పనిలో నిమిగ్నమయ్యారు సంబంధిత అధికారులు. మూడేండ్లుగా బీజాపూర్ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కర్ణాటకలోని బీజాపూర్ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతపు సెలవుల్లో అయితే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు అధిక ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అంతేకాకుండా రహదారి చిన్నగా ఉండడం, వాహనాలు పెరగడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాలుగు లైన్ల రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. దీని కోసం రూ.928.41 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలుత రూ.800 కోట్లతో అంచనాలను రూపొందించినప్పటికీ, తాజా అంచనాల ప్రకారం మరో రూ.128 కోట్లకు పెంచారు. అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులకు 350 ఎకరాల మేర భూములను సేకరించనున్నారు. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల మాదిరిగా కాకుండా ఎక్స్ప్రెస్ వే తరహాలో బీజాపూర్ జాతీయ రహదారి అందుబాటులోకి రానున్నది. అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ రహదారి ప్రస్తుతం కొన్ని చోట్ల 25 మీటర్లు, మరికొన్ని చోట్ల 30 మీటర్లుగా ఉంది.
రోడ్డు విస్తరణలో భాగంగా 60 మీటర్ల మేర రహదారిగా విస్తరించి నాలుగు లైన్లుగా మార్చనున్నారు. ఇప్పటికే మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్, బీజాపూర్ వరకు 45 కిలోమీటర్ల మేర మూడు లైన్ల రహదారిగా అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెళ్లే జాతీయ రహదారి మధ్య ఉన్న గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్పాస్ బ్రిడ్జిలను కూడా నిర్మించనున్నారు. 46 కిలోమీటర్ల పరిధిలో ఆరు భారీ అండర్పాస్ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు. బైపాస్ రోడ్లను కూడా నిర్మించేందుకు ప్లాన్ చేశారు. రెండు బైపాస్ రోడ్లు కూడా జిల్లాలోనే నిర్మించనున్నారు. మొయినాబాద్ వద్ద 4.35 కిలోమీటర్ల మేర, చేవెళ్ల వద్ద 6.36 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లను నిర్మిస్తామని అధికారులు వెల్లడించారు.