ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు జీవం పోస్తున్నది. అందులో భాగంగానే గొల్లకుర్మలకు రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. సబ్సిడీ ద్వారా రెండో విడుతలో గొర్రెలను అందుకోనున్నవారి కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. గొర్రెల కాపరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో సంచార వైద్యశాలను కూడా ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రత్యేకించి అంబులెన్స్ల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నది. గ్రామాలవారీగా సమస్యలు లేకుండా దాణాను కూడా అందజేసి పెంపకానికి ప్రభుత్వం సహకారం అందిస్తున్నది.
జిల్లాలో 384 సొసైటీలు..
రంగారెడ్డి జిల్లాలో వివిధ మండలాలతో కలిపి మొత్తం 384 గొర్రెల పెంపకం దారుల సొసైటీలున్నాయి. సొసైటీల పరిధిలో సుమారు 40వేల మందికి పైగా సభ్యులున్నారు. రెండో విడుతలో మిగిలిన వారందరికీ లబ్ధి చేకూరనుంది. మొదటి విడుతలో 11,672 యూనిట్ల గొర్రెలు అందజేశారు. రెండో విడుతలో మిగిలిన వారందరికీ గొర్రెలు అందజేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
యూనిట్ కాస్ట్ను పెంచిన ప్రభుత్వం
ప్రభుత్వం ఒక్కో యూనిట్ కాస్ట్ను పెంచింది. ప్రభుత్వం గొర్రెల పెంపకందారులకు గతంలో యూనిట్ కాస్ట్ రూ.1.50లక్షలు అందజేసేది. ప్రస్తుతం యూనిట్ కాస్ట్ను రూ.1.70లక్షలకు పెంచింది. ఇందులో లబ్ధిదారుడి వాటాగా రూ.43వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్ కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేయనుంది. ప్రభుత్వం యూనిట్ కాస్ట్ను పెంచడంతో గొర్రెల పెంపకందారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గొర్రెలు అందించడం సంతోషకరం
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్లకుర్మల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమంతో పాటు గొల్లకుర్మలు ఆర్థికంగా లబ్ధిచేకూర్చేందుకు ఒక్కో యూనిట్ కింద 20 గొర్రెలు, ఒక్క పొట్టేలును అందించడం ఎంతో సంతోషం. ప్రభుత్వం అందజేస్తున్న ఈ సబ్సిడీ గొర్రెలతో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేయూతనివ్వడం సంతోషకరం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్లకుర్మలు సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం.
– కాళ్లె గణేశ్, కుర్మ సంఘం నాయకుడు
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం
ప్రభుత్వం రెండో విడుత గొర్రెల పంపిణీకి కసరత్తు చేస్తున్నది. బడ్జెట్లో ఇప్పటికే నిధులు కూడా కేటాయించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే పంపిణీ ప్రారంభిస్తాం. పెరిగిన యూనిట్ ధరకు అనుగుణంగా లబ్ధిదారులు మిగతా మొత్తాన్ని చెల్లించి అధికారులకు డీడీలు అందించాలి. అర్హులైన లబ్ధిదారులందరికీ గొర్రెలు అందజేస్తాం. రెండో విడుతలో 21వేల యూనిట్లు అందించాలన్నదే లక్ష్యం.
– అంజిలప్ప, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి