పరిగి, సెప్టెంబర్ 10: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు తోడ్పాటునందిస్తున్నది. అన్ని రంగాలతోపాటు విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తున్న సర్కారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నది. ప్రభుత్వ కొలువులే ధ్యేయంగా చదివే ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణను సైతం అందిస్తున్నది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాకు నాలుగు బీసీ స్టడీ సెంటర్లను మంజూరు చేసింది. వాటిలో రెండు స్టడీ సెంటర్లు ఈనెల 15వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొన్ని నెలలుగా విడుతల వారీగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పేద అభ్యర్థులకు ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేసి ఉచిత భోజన వసతి, స్టడీ మెటీరియల్ అందించడంతోపాటు శిక్షణను ఇప్పించారు. దీంతోపాటు ఎస్టీ సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోనూ ఉచిత శిక్షణా శిబిరాలను నిర్వహించారు. రానున్న రోజుల్లోనూ ఉద్యోగార్థులకు దోహదపడేలా ప్రభుత్వం నాలుగు బీసీ స్టడీ సెంటర్లను వికారాబాద్ జిల్లాకు మంజూరు చేసింది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాల్లో బీసీ స్టడీ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.
ప్రతి కేంద్రంలో 200 మందికి ఉచిత శిక్షణ..
జిల్లాలో ఏర్పాటు కానున్న బీసీ స్టడీ సెంటర్లలో .. ఒక్కో సెంటర్లో 100 నుంచి 200 మంది ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యోగార్థులు శిక్షణ పొందేందుకు ఆన్లైన్ లేదా నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ స్టడీ సెంటర్ల ద్వారా సుమారు 800 మంది వరకు ఉచితంగా శిక్షణ పొం దే అవకాశం ఉన్నది. ఈ స్టడీ సెంటర్లలో గ్రూప్-1, 2, 3 ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నా రు. తద్వారా గ్రామీణ ప్రాం తాల్లోని వందలాది మం ది ఉద్యోగార్థులకు మేలు జరుగనున్నది. గతంలో దూర ప్రాంతాల్లో ఉన్న స్టడీ సెంటర్లలో శిక్షణ పొం దడం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉండేది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ బీసీ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించడం ద్వారా ఉచిత శిక్షణ అందరికీ అందుబాటులోకి రానున్నది. బీసీ స్టడీ సెంటర్ల ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రెండు సెంటర్ల ప్రారంభానికి ఏర్పాట్లు
వికారాబాద్ జిల్లాకు నాలుగు బీసీ స్టడీ సెంటర్లు మంజూరు కాగా.. ఈనెల 15వ తేదీన వికారాబాద్, తాండూరుల్లో రెండు చోట్ల స్టడీ సెంటర్ల ప్రారంభానికి వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరులో ఏర్పాటు కానున్న స్టడీసెంటర్లో శిక్షణ బాధ్యతలను ప్రగతి ఇనిస్టిట్యూట్కు, వికారాబాద్లోని స్టడీ సెంటర్ బాధ్యతలు యాస్ప్రిన్ ఇనిస్టిట్యూట్కు అప్పగించినట్లు సమాచా రం. ఈ రెండు సెంటర్లలోనూ నిపుణులైన ఫ్యాకల్టీతో ప్రత్యేక శిక్షణ అభ్యర్థులకు ఇప్పించనున్నారు. ఈనెల 7వ తేదీనే ప్రారంభించాలని మొదట నిర్ణయించగా వివిధ కారణాలతో రద్దు అయ్యింది. తాండూరులో డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుకు మొదట నిర్ణయించగా స్థలం మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో స్టడీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది నిర్ణయించనున్నారు. రెండోవిడుతలో పరిగి, కొడంగల్లలో బీసీ స్టడీ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.