షాబాద్, సెప్టెంబర్ 4: పేదలకు మెరుగైన వైద్యం అం దించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ దవాఖానల బలోపేతానికి.. మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. రంగారెడ్డి జిల్లాలో 45 ప్రభుత్వ దవాఖానలతోపాటు మరో 30వరకు బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు పీహెచ్సీల్లోనూ 24 గంటలపాటు వైద్యసేవలను అందిస్తున్నది. మహిళలు ప్రసవాలకోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి రూ.వేలకు వేలు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సర్కార్ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టింది. కేసీఆర్ కిట్లతోపాటు వైద్యపరీక్షలు, చికిత్సలు, అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఉచితంగా ఇస్తుండటంతో ప్రజ లు అధిక సంఖ్యలో సర్కార్ దవాఖాలకు వెళ్తున్నారు. తాజాగా సాధారణ ప్రసవాలు జరిగితే రూ.3 వేల నగదును దవాఖానలకు ప్రోత్సాహకంగా ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ మా ర్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దీంతో రానున్న రోజుల్లో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో మరింత ఆదరణ, నమ్మకం పెరుగనున్నది.
జిల్లాలో 45 ప్రభుత్వ దవాఖానలు..
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు, రాజేంద్రనగర్, శేరిలింగపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 45 ప్రభుత్వ దవాఖానలున్నాయి. ఇందులో ఒకటి కొండాపూర్ జిల్లా ప్రభుత్వ దవాఖాన, రెండు ఏరియా దవాఖానలు, ఐదు సీహెచ్సీలు, 36 పీహెచ్సీలతోపాటు 30 బస్తీ దవాఖానలున్నాయి. జిల్లా, ఏరియా, కమ్యూనిటీ దవాఖానలతోపాటు పీహెచ్సీల్లోనూ ప్రసవాలు జరిగే లా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే కేసీఆర్ కిట్లను అందజేస్తున్నారు. ఆడపిల్ల జన్మిస్తే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ. 12 వేలు ఇస్తున్నారు. దీంతో చాలామంది ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో సిజేరియన్కే ప్రాధాన్యత ఇస్తుండటంతోపాటు ఫీజును రూ.వేలల్లో వసూ లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకున్న దవాఖానలకు రూ.3వేల నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. వైద్యారోగ్య శాఖ అధికారులు మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేశారు. దీని ప్రకారం రూ.3 వేల నగదులో డాక్టర్లకు రూ.1,000, స్టాప్ నర్సు, ఏఎన్ఎంలకు రూ.1,000, శానిటేషన్ వర్కర్లకు రూ.500 చొప్పున ఇవ్వనున్నారు. సబ్సెంటర్లలోని ఏఎన్ఎంలకు రూ.250, ఆశవర్కర్లకు రూ. 250 చొప్పున ఇవ్వనున్నారు. ఈ ప్రోత్సాహాన్ని 85 శాతం సాధారణ ప్రసవాల లక్ష్యాన్ని చేరుకున్న దవాఖానలకే అందించనున్నారు.
దవాఖానలకు టార్గెట్లు..
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నార్మల్ డెలివరీలు చేస్తున్న వైద్యసిబ్బందికి అందిస్తున్న రూ.3వేల నగదు ప్రోత్సాహంతోపాటు ఆయా దవాఖానలకు ప్రతినెలా లక్ష్యం మేర ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని టార్గెట్ను ప్రభుత్వం నిర్దేశించింది. జిల్లాలోని కొండాపూర్ ప్రభుత్వ జిల్లా దవాఖానకు సుమారు 1,200, వనస్థలిపురం, హస్తినాపురం ఏరియా దవాఖానలకు 300, చేవెళ్ల, షాద్నగర్, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు సీహెచ్సీల్లో 100, వీటితోపాటు 36 పీహెచ్సీల్లో 5-10 వరకు, మరో 30 బస్తీ దవాఖానల్లోనూ 5-10 సాధారణ ప్రసవాలు నెలలో జరిగేలా చూడాలని ప్రభుత్వం సూచించగా..ఆ మేరకు వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు జిల్లాలోని కొందుర్గు, ఆమనగల్లు, కందుకూరు, సరూర్నగర్ దవాఖానల్లో నెలకు సుమారు 20 వరకు నార్మల్ డెలివరీలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రసవాల కోసం సర్కార్ దవాఖానకు వచ్చిన మహిళలకు ఇబ్బందుల్లేకుండా ప్రభు త్వం వసతులు కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ ప్రసవాల పెంపునకు చర్యలు
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల పెంపునకు ప్ర భుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్లను ఇస్తుండటంతో ఎక్కువ శాతం మంది మహిళలు ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారు. తాజాగా నార్మల్ డెలివరీలు చేస్తే వైద్యసిబ్బందికి రూ.3వేల నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సాధారణ కాన్పుల సంఖ్య మరింత పెరుగనున్నది.
-డాక్టర్ దామోదర్, జిల్లా ఉప వైద్యాధికారి