రంగారెడ్డి, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైంది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 77.10లక్షల మొక్కలు నాటాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకుమించి 80 లక్షలకు పైగా మొక్కలను నాటి ఆదర్శంగా నిలిచారు. అన్నిశాఖల అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటడం ఉద్యమంలా సాగింది. నాటిన ప్రతి మొక్కనూ బతికించేలా అధికారులు చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తి చేయగా.. ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. హరితనిధికి ప్రతి నెలా సమకూరుతున్న నిధులతో నాటిన మొక్కల పెంపకానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గత ఏడేండ్లుగా జిల్లాలో మొత్తం 5.6 కోట్ల మొక్కలు నాటారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది లక్ష్యానికి మించి మొక్కలను నాటారు. ఈ ఏడాది 77.10 లక్షల మొక్కలను నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా 80 లక్షలకు పైగా నాటారు. రంగారెడ్డి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావడంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగింది. అంతేకాకుండా మొక్కలను నాటిన అనంతరం విస్మరించకుండా ప్రతి మొక్కనూ బతికించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేశారు. మొక్కల జియోట్యాగింగ్లో భాగంగా ప్రభుత్వం రూపొందించిన జియో ట్యాగింగ్ యాప్లో ఎక్కడెక్కడ ఎన్ని మొక్కలు నాటారనే వివరాలను కూడా పొందుపరిచారు. అంతేకాకుండా ఎక్కడైతే మొక్కలు నాటారో అక్కడ నెవిగేషన్తో మొక్కల ఫొటోలు తీసి ఆన్లైన్లో పొందుపరిచారు. జియోట్యాగింగ్ ప్రక్రియతో నాటిన మొక్క ఏ విధంగా ఉందనేది ఆన్లైన్ ఆధారంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్ (రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)కు అధిక ప్రాధాన్యతనిచ్చారు.
అదేవిధంగా 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో జిల్లా లో పచ్చదనం పర్చుకున్నది. జిల్లాలో ఏడేండ్లుగా హరితహారంలో భాగంగా 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17లో 1.39 కోట్ల మొక్కలు, 2017-18లో 71.04 లక్షలు, 2018-19లో 86.12 లక్షల మొక్కలు, 2019-20 లో 1.02 కోట్ల మొక్కలు, 2020 -21 సంవత్సరంలో 89 లక్షల మొక్కలు, ఈ ఏడాది 80 లక్షలకుసైగా మొక్కలను జిల్లాలో నాటారు.
ఈ ఏడాది 80 లక్షలకు పైగా..
తెలంగాణకు హరితహారంలో భాగంగా ఈ ఏడాది 77.10 లక్షల మొక్కలను నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యానికి మిం చి 80 లక్షలకు పైగా లక్షల మొక్కలను నాటారు. ఈ ఏడాది ప్రధానంగా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్దితోపాటు జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, మునగ, గులాబీ, మందా రం, మల్లె, కానుగ, నెమలినార తదితర మొక్కలను నాటారు. అయితే ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకోసం గ్రామాల్లో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. ఇంటి ఆవరణలో జామ, కరివేపాకు, దానిమ్మ, పూల మొక్కలైన గులాబీ, మందారం, మల్లె మొక్కలతోపాటు గ్రామాల పరిధిలో వివిధ రకాల మొక్కలను నాటారు.