ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 17 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం నుంచి కర్ణంగూడ, ఎలిమినేడు, పోచారం గ్రామాల మీదుగా మంగల్పల్లి వరకు ఉన్న సింగిల్రోడ్డును నాలుగులేన్ల రోడ్డుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.58కోట్లు విడుదల చేసింది. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే ఈ రోడ్డు వెంట ప్రయాణించే ప్రయాణికులు, ప్రజల రవాణా కష్టాలు తీరటంతో పాటు రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. సమైక్య ప్రభుత్వాల హయాంలో ఈ రోడ్డును విస్తరించి నాలుగులేన్ల రోడ్డుగా మార్చుతామని హామీలు ఇచ్చినప్పటికీ అవి నీటిమీద రాతలుగానే మారాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామాలకు ఉన్న రోడ్లను అద్దంలా తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరువతో సింగిల్రోడ్లను నాలుగులేన్ల రోడ్లుగా మార్చారు. ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు గ్రామం వరకు ప్రమాదకరంగా ఉన్న ఈ రోడ్డును విస్తరించేందుకు ఇటీవల ప్రభుత్వం రూ.58కోట్లు విడుదల చేసింది. ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు వరకు 33ఫీట్లు, మంగల్పల్లి నుంచి ఎలిమినేడు వరకు 22ఫీట్ల రోడ్డుగా విస్తరించనుండటంతో ఎలిమినేడు, కర్ణంగూడ, పోచారం, మంగల్పల్లి, చర్లపటేల్గూడతో పాటు పలు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు పలు గ్రామాల రైతులు తమ భూమిని ఇచ్చేందుకు ఒప్పందంతో పనులు వేగంగా కొనసాగనున్నాయి.
రోడ్డు విస్తరణతో భూముల ధరలకు రెక్కలు..
ఇబ్రహీంపట్నం నుంచి కర్ణంగూడ, ఎలిమినేడు, పోచారం, మంగల్పల్లి వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులతో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసిన పలు ఐటీ, పారిశ్రామిక, రక్షణరంగ సంస్థల ఏర్పాటుతో భూముల కోట్లాది రూపాయల ధరలు పలుకుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఐటీరంగ సంస్థలతో పాటు ఈ రోడ్డు వెడల్పు పనులతో ఈ గ్రామాల్లోని భూముల ధరలు విపరీతంగా పెరిగే అవకాశముండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అనేక ఐటీ, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుతో పాటు రోడ్డు వెడల్పు పనులతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.
రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
ఇబ్రహీంపట్నం నుంచి కర్ణంగూడ, ఎలిమినేడు, పోచారం గ్రామాల మీదుగా మంగల్పల్లి వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకిరువైపులా ఉన్న గోతులను పూడ్చటంతో పాటు మట్టిని చదును చేసే పనులు జేసీబీలు, హిటాచీల ద్వారా ముమ్మరంగా సాగుతున్నాయి. రోడ్డు పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రయాణికుల కష్టాలను తీర్చాలన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్అండ్బీ అధికారులు పనులు చకచకా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రోడ్ల వెడల్పు పనులు పూర్తి చేస్తాం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం నుంచి పలు మండల కేంద్రాలను కలుపుతూ ఉన్న రోడ్ల విస్తరణకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మోక్షం లభించింది. ముఖ్యంగా ఎలిమినేడు గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పనులు సైతం ప్రారంభించాం. త్వరలో నిర్మాణం పూర్తి చేసేందుకు కృషిచేస్తాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు
ఇబ్రహీంపట్నం నుంచి కర్ణంగూడ మీదుగా ఎలిమినేడు వరకు ఉన్న సింగిల్లేన్ రోడ్డులో ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటంతో పాటు పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా రూపుమాపేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి రోడ్డు పనులు చేపడుతుండటం సంతోషకరం. ఈ రోడ్డు విస్తరణతో పూర్తిగా ప్రమాదాలు తగ్గిపోనున్నాయి. రోడ్డు విస్తరణకు సహకరించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– వంగేటి కవితా తిరుమల్రెడ్డి, సర్పంచ్ కర్ణంగూడ