రంగారెడ్డి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/షాద్నగర్ 12: యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముం దుకు సాగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సూచించారు. హార్ట్ఫుల్ నెస్, యునెస్కో ఎంజీఐఈపీ, ఏఐసీటీఈల సం యుక్తాధ్వర్యంలో మూడు రోజులపాటు జరుగను న్న అంతర్జాతీయ యువజన సదస్సు శుక్రవారం నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో ప్రా రంభం కాగా…మంత్రి కేటీఆర్ రైజింగ్ విత్ దయాగుణం అనే కార్యక్రమంలో జూమ్ ద్వారా మాట్లాడారు. దేశంలోని యువత సరైన మార్గాన్ని ఎంచుకోవాలని.. తగిన శిక్షణ, నైపుణ్యం లేకుంటే ప్రాథమిక సవాళ్లను ఎదుర్కొలేరని అభిప్రాయపడ్డారు.
యువత సరైన దిశలో వెళ్తేనే దేశానికి, ప్రజలకు ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. విద్యార్థి దశలోనే సమాజంపై వారికి అవగాహన పెంచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తామని, వారిలో అభిరుచి, దయాగుణం, విలువలను నేర్పించేందు కు ప్రయత్నిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు. అదేవిధంగా మానవాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధు లు ముందుకు రావాలని సూచించారు.
మానవాభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇందులో ప్రభుత్వం పాత్ర పరిమితంగానే ఉన్నప్పటికీ ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు బంజరు భూమిని ఒయాసిస్గా మా ర్చడంలో కన్హా శాంతివనం విజయం సాధించడం బాగుందన్నారు. కన్హా శాంతివనం వంటి సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సా హం కచ్చితంగా ఉంటుందన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల్లో గెలువాలనే తపనతో పనిచేస్తాయని, అయితే బ్యూరోక్రాట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమాజంలో సమన్వయంతో పనిచేయాలని, ప్రజల్లో కరుణ, దయ, విలువలు వం టి వాటిని పెంపొందించాలన్నారు.
కాలికి గాయం కారణంగా నేరుగా పాల్గొనలేకపోయానని, త్వరలోనే కన్హా శాంతివనంలో పర్యటిస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా ఈ సదస్సుకు 55 దేశాల నుంచి 12 వేల మంది యువత హాజరు కాగా.. యునెస్కో ఎంజీఐఈపీ డైరెక్టర్ అనంతతోపాటు పలువురు ప్రముఖులు సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ డైరెక్టర్ సంజయ్ సెహగల్, డైరెక్టర్ రమేశ్కృష్ణన్, గాయని ఖతీజారెహమాన్, గ్రేస్మూర్ తదితరులు పాల్గొన్నారు.
యువత దయాగుణాన్ని కలిగి ఉండాలి
యువత మంచి ఆలోచనలను కలిగి ఉండటంతో పాటు ఇతరులకు ఉపయోగపడేలా దయాగుణాన్ని అలవర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా అందుతున్న తాగునీరు, భూ సంస్కరణల అమలు తీరు
చాలా బాగుంది.
– కమలేశ్ పటేల్ దాజీ, హార్ట్ఫుల్నెస్ గైడ్