ఫ్రీడం రన్ ఆద్యంతం ఆకట్టుకున్నది. 75వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రన్ విజయవంతమైనది. విద్యార్థులు, యువతీయువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటారు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్నగర్ స్టేడియం నుంచి ఎల్బీ నగర్ క్రాస్ రోడ్డు వరకు జరిగిన ఫ్రీడమ్ రన్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. జాతీయ జెండాలతో కిలోమీటర్ల మేర రన్లో పాల్గొనడంతో ఆయా రహదారులు త్రివర్ణ శోభితంగా మారాయి.
రంగారెడ్డి, ఆగస్టు 11, (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా గురువారం జిల్లా అంతటా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో జాతీయ సమైక్యతను చాటుతూ ఫ్రీడమ్ రన్ సాగింది. విద్యార్థులు, యువకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలోని సరూర్నగర్ స్టేడియం నుంచి ఎల్బీ నగర్ క్రాస్ రోడ్డు వరకు జరిగిన ఫ్రీడమ్ రన్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు మూసీ రివర్ బోర్డు చైర్మన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్, యెగ్గే మల్లేశం, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రంగారెడ్డి కలెక్టర్ డి.అమయ్కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. షాద్నగర్ పట్టణంలో జరిగిన 2కే రన్లో షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, షాబాద్ చౌరస్తా నుంచి చేవెళ్ల బస్టాండ్ వరకు నిర్వహించిన ఫ్రీడమ్ రన్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 15 రోజలపాటు సంబురాలు, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, ఆగస్టు 11 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం వికారాబాద్ జిల్లాలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు ప్రతి మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో 2కే ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి పాల్గొన్నారు. ఎన్నెపల్లి క్రాస్రోడ్డు నుంచి ఎన్టీఆర్ క్రాస్రోడ్డు వరకు ఫ్రీడమ్ రన్ జరిగింది. జిల్లాలోని పరిగిలో జరిగిన ఫ్రీడమ్ రన్లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫ్రీడమ్ రన్ ప్రారంభించడంతోపాటు స్వయంగా వారు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో స్థానిక ఎస్ఐల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఫ్రీడమ్ రన్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఫ్రీడమ్ రన్లో జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేశభక్తిని పెంపొందించుకోవాలి
వికారాబాద్, ఆగస్టు 11 : ప్రతి ఒక్కరూ దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ రన్ సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డిలతో కలిసి జెండా ఊపి ర్యాలీ జాతీయ స్ఫూర్తిని చాటుతూ ఉత్సాహంగా సాగించారు. ఎన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, చౌరస్తాలో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.