ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్ట్టు 11 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గ్రామాల్లోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు రెపరెపలాడాలని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి అన్నారు. ఉప్పరిగూడ లో గురువారం వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఇంటింటికీ జాతీయ జెండాలు అందజేశారు. దండుమైలారం గ్రామంలో సర్పంచ్ రవణమోని మల్లీశ్వరి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ నిర్వహించారు. కప్పాడు గ్రామంలో సర్పంచ్ సామల హంసమ్మ ఆధ్వర్యంలో జెండాలు అందజేశారు.
ఇంటింటికీ తిరంగా..
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలో స్వాత్రంత్య భారత వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం కౌన్సిలర్లు స్వయంగా వార్డుల్లో కలియ తిరుగుతూ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. 6వ వార్డులో పసుల రాజేందర్, 5వ వార్డు బొర్రా అనురాధ, 16వ వార్డులో దేవిడి గీతా వేణుగోపాల్రెడ్డి, 18వ వార్డులో రమావత్ పరశురాం నాయక్ ఆధ్వర్యంలో జెండాలను అందజేశారు. స్వాతంత్య్రం గొప్పతనాన్ని వివరించారు.
జాతీయ జెండాల పంపిణీ
చేవెళ్ల రూరల్ : జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ భక్తిని చాటాలని రావులపల్లి, హస్తేపూర్ గ్రామాల సర్పంచ్లు కేసారం శ్రీనివాస్, వెంకటయ్య తెలిపారు. గురువారం చేవెళ్ల మండల పరిధిలోని రావులపల్లి, హస్తేపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరవేయాలని చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మల్కాపూర్ గ్రామంలో సర్పంచ్ శివారెడ్డి, న్యాలట గ్రామంలో సర్పంచ్ లక్ష్మీసత్యనారాయణలు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వెంకట్ రెడ్డి, శంకర్, గ్రామస్తులు, నాయకులు తదితరులు ఉన్నారు.