రంగారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విధంగా ఇంటింటికీ జెండాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. నేటి నుంచి జిల్లాలోని ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ ప్రారంభంకానున్నది. నేడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లాకు విడుతల వారీగా సరిపడా జాతీయ జెండాలు రానుండగా.. ఇప్పటివరకు లక్ష జెండాలు చేరాయి. మరోవైపు జిల్లాలోని మున్సిపాలిటీల్లో మున్సిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో, గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేపట్టనున్నారు.