ఎడతెరిపిలేని వానలతో జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను కాపాడుకునేందుకు అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశమున్నందున పంటల మడుల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, సరైన మెళకువలు పాటిస్తే పంటలను రక్షించుకోవచ్చని ఇబ్రహీంపట్నం వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ పేర్కొన్నారు.
వరి పంట…
జిల్లాలో ఎక్కువగా వరి నారు మడులను రైతులు సిద్ధం చేస్తున్నారు. వెదజల్లే పద్ధతిలో విత్తుకున్న పొలాలు, మడుల్లో నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలిగించాలి. చిన్న మొలకలు అధిక నీటిని తట్టుకోలేవు. వర్షాలు కురుస్తున్నందున మందులు వేసినా సామర్థ్యం తగ్గిపోతుంది. వాతావరణం మాములు స్థితికి వచ్చిన తరువాత అధికారుల సూచనల మేరకు ఎరువులు, కలుపు నివారణ మందులు వాడుకుంటే మంచిదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు నార్లు పోయని రైతులు ఉంటే వర్షాలు తగ్గిన తరువాత పోసుకుంటే మంచింది. నారు పండుబారి పేలవంగా ఉంటే ఎకరాకు 1.5 నుంచి 2 కిలోల యూరియా వేసుకోవాలి. చెలెటెడ్ జింక్ 1గ్రాము లేదా జింక్ సల్ఫేట్ 2గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరినారు మడి నారు తీసే వారం పది రోజుల ముందు తప్పనిసరిగా ఎకరాకు ఆర్బోఫారస్ 3జీ గులికలు 800 గ్రాములు వేసుకోవాలి.
అధికారుల సూచనలు పాటించాలి..
అధిక వర్షాల కారణంగా పంటలను రక్షించుకునేందుకు వ్యవసాయాధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అధికారులు రాసి ఇచ్చిన మందులు, ఎరువులను వాడి పంటలను రక్షించుకోవాలి. ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు అధికారుల సలహాలు తీసుకోవాలి.
– సత్యనారాయణ, వ్యవసాయశాఖ ఏడీఏ ఇబ్రహీంపట్నం
పత్తి పంట…
లేత దశలో ఉన్న పత్తిపంట నిల్వ నీటిని తట్టుకోలేదు. గండ్లు పెట్టి నీటిని తొలిగించాలి. కలుపు మొక్కల నివారణకు డెమో అమర్చి పారాక్యాట్క్లోరైడ్ 5మిల్లీ లీటర్లకు లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి. ఆ తర్వాత దశలో ఫైరిథియోబ్యాక్ సోడియం, క్విజాఫోప్ ఇథైల్ కలయిక మందు మాస్టర్స్ట్రోక్ 450మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారీ చేసినట్లయితే వెడ్పల్పు ఆకులు కలిగి ఉండే గడ్డిజాతి కలుపును అదుపులో ఉంచవచ్చు. ఈ మందును కంది అంతర పంటగా ఉన్న పత్తిలో వాడవద్దు. వర్షాలు తగ్గిన తరువాత బ్లూస్టర్ డోస్గా ఎకరాకు 25-30కిలోల యూరియా మొక్కల పక్కన వేసుకోవాలి. పోషక లోప నివారణ కోసం 19-19-19లీటర్ నీటికి 7.5గ్రాముల ఫార్ములా 4-2గ్రామలు చొప్పున సూస్ప్రెడ్మాక్స్ 1 మిల్లీ లీటర్ కలిపి పిచికారీ చేయాలి. అక్కడక్కడా 3-4ఆకుల దశలో ఉన్న పత్తిలో ఆకులపై రంద్రాలు, ముడత కనిపిస్తుంది.
ఇందుకు క్లోరిఫైరిపాస్ 20 2.5మిల్లీ లీటర్లు, లేదా ఎసిఫేట్ 1.5గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కండానికి బొట్టు పెట్టే విధానాన్ని ఆచరించి 30రోజుల దశలో ఉన్న పత్తిని ఆశించే రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇందుకు ఒక పాలు మోనోక్రోటోపాస్, నాలుగు పాళ్లు నీళ్లు కలిపి లేదా కాండం భాగంలో అంగులం మేర అంటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పత్తిపంటలో అధిక దిగుబడి సాధించేందుకు వర్షం నుంచి కాపాడుకోవడం కోసం సరైన మెళకువలు పాటిస్తే ఎంతో మేలు.
మొక్కజొన్న, ఇతర పంటలు..
మొక్కజొన్నలోనూ నిల్వ నీటిని తొలిగించాలి. వర్షం తగ్గిన తర్వాత బూస్టర్ మోతాదుకు 53కిలోల యూరియా, 15కిలోల మ్యూరేట్ఆప పొటాష్ వేసుకోవాలి. జింక్, బోరన్ లోపం కనిపిస్తే బోరాన్ 2గ్రాములు, చెలెటెడ్ జింక్ 1గ్రాము చొప్పున పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. కూరగాయల పంటలకు వర్షాల కారణంగా ఆకుమచ్చ, కాండం కుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. కాపర్ ఆక్స్క్లోరైడ్ 30గ్రాములు 10లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పోషక లోప నివారణకు 13-0-45లీటర్ నీటికి 10గ్రాముల ఫార్ములా 4-2గ్రాముల కలిపి పిచికారీ చేసుకోవాలి.