ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగగా, ఇప్పటికే మత్తడి దుంకుతున్న చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. చెక్ డ్యాంల్లోకి వరద నీరు కొనసాగుతుండడంతో అలుగు పారుతున్న నీటిలో జనం చేపలు పడుతున్నారు. పలు గ్రామాల్లో ముసురు పడుతుండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
పరిగి, ఆగస్టు 8 : వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కులకచర్లలో 7.2 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. దోమలో 7.1 సెం.మీ., కొడంగల్లో 59.5 మి.మీ., దౌల్తాబాద్లో 52.7 మి.మీ., బొంరాస్పేట్లో 49.9 మి.మీ., పూడూరులో 36.0 మి.మీ., బషీరాబాద్లో 34.3 మి.మీ., యాలాల్లో 32.4 మి.మీ., తాండూరులో 29.7 మి.మీ., పెద్దేముల్లో 28.4 మి.మీ., ధారూర్లో 25.5 మి.మీ., వికారాబాద్లో 24.5 మి.మీ., బంట్వారంలో 21.2 మి.మీ., మర్పల్లిలో 12.4 మి.మీ., మోమిన్పేట్లో 12.4 మి.మీ., నవాబుపేట్లో 10.4 మి.మీ., కోట్పల్లిలో 18.5 మి.మీ., చౌడాపూర్లో 11.0 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో ప్రజలు ఇండ్లకే పరిమితయ్యారు. వాగుల పారుతుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
కేశంపేట మండలంలో..
కేశంపేట ఆగస్టు 8 : మండలంలో వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. అల్వాల, కేశంపేట, బొదునంపల్లి, లేమామిడి, నిర్దవెళ్లి, తొమ్మిదిరేకుల, లింగంధన గ్రామాల మీదుగా ఉన్న వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు మత్తడి దుంకుతున్నాయి. చెక్డ్యాం వద్ద యువకులు చేపలు పట్టే పనిలో నిమగ్నమయ్యారు.
చేవెళ్ల నియోజకవర్గంలో..
షాబాద్, ఆగస్టు 8 : చేవెళ్ల నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా ముసురు పడింది. సోమవారం ఉదయం చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో ముసురు పడడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచిస్తున్నారు.
కడ్తాల్ మండలంలో..
కడ్తాల్, ఆగస్టు 8 : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వానతో చెరువులు, కుంటలు, వాగులు, చెక్డ్యాంలు అలుగుపారుతున్నాయి. రావిచేడ్ గ్రామంలోని నాగోని చెరువు నిండి మత్తడి దుంకుతున్నది. ఆయా గ్రామాల్లో సర్పంచ్లు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.