యాచారం, ఆగస్టు 7: పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. పర్యావరణ సమతుల్యత కోసం ఇప్పటికే హరితహారం ద్వారా విరివిగా మొక్కలు నాటడం, ప్రతి గ్రామానికీ పల్లెప్రకృతివనాన్ని ఏర్పాటు చేసి మొక్కలను పెంచడంతోపా టు.. తాజాగా అటవీ శాతాన్ని పెంచేందుకు మండలంలో ఐదు బృహత్ పల్లెప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తక్కు వ స్థలంలో విరివిగా ఎక్కువ మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టింది. జపాన్ దేశంలో విజయవంతమైన మియావాకి విధానం ద్వారా బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో చిట్టడవులను పెంచనున్నారు. ఉపాధిహామీలో ఈ పనులను అధికారులు ముమ్మరంగా చేపడుతున్నారు. మండలంలోని నందివనపర్తి, యాచా రం, తాటిపర్తి, తక్కళ్లపల్లితండా, చింతపట్ల గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా.. యాచారం, తక్కళ్లపల్లితండాల్లో ఇప్పటికే పనులు పూర్తి కాగా.. తాటిపర్తి, నందివనపర్తి, చింతపట్ల గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు తీయడం, మొక్కలు నాటడం తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా మండల కేంద్రంలో గతంలోనే ఆరు ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశా రు. అందులో వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ఇప్పటికే మొక్కలు ఏపుగా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఎంపీడీవో విజయలక్ష్మి సమక్షంలో ఏపీవో లింగయ్య, ఈవో శివశంకర్రెడ్డి పర్యవేక్షణలో బృహత్ పల్లె ప్రకృతివనాన్ని అందంగా తీర్చిదిద్దడంతో అందులో పచ్చదనం ఉట్టిపడుతున్నది. ఆ ప్రాంతమంతా ఎక్కడ చూసినా ఆహ్లాదకర వాతావరణం సంతరించుకున్నది.
యాచారం బృహత్ పల్లెప్రకృతివనంలో..
మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటుకు అప్పటి తహసీల్దార్ నాగయ్య ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. రాళ్లు, రప్పలు, పిచ్చి మొక్కలతో ఉన్న ఆ స్థలాన్ని అప్పటి ఎంపీడీవో మమతాబాయి ఆధ్వర్యంలో ఈజీఎస్ అధికారులు జేసీబీల సహాయంతో చదును చేశారు. మండలంలోని పలు గ్రామాల్లోని నర్సరీలు, అటవీశాఖ నర్సరీల నుంచి అవసరమైన అన్ని రకాల మొక్కలను తీసుకొచ్చి నాటారు. ప్రజలు నడిచేందుకు వీలుగా ఆరు మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా వసతులను కల్పించారు. ఆరు ఎకరాల విస్తీర్ణం గల స్థలాన్ని నాలుగు భాగాలు గా విభజించి ఒక్కో భాగంలో మీటరు పొడవు, మీటరు వెడల్పుతో సుమారు 15,000 మొక్కలను నాటారు. మొత్తం 47 రకాల మొ క్కలను నాటారు. అందులో వివిధ రకాల ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు, వెరైటీ మొక్కలు, అంతరించిపోతున్న మొక్కలున్నాయి. ప్రస్తుతం ఈ మొక్కలు ఏపుగా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నారు. పచ్చదనంతోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మండలంలోని తాటిపర్తి, నందివనపర్తి, తక్కళ్లపల్లితండా, చింతపట్ల గ్రామాల్లోనూ యాచారం మాదిరిగా బృహత్ పల్లెప్రకృతివనాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
అలరిస్తున్న అందమైన పెయింటింగ్స్
యాచారం బృహత్ పల్లెప్రకృతివనంలో ఉన్న రాళ్లు, గుట్టలకు రకరకాల రంగులు, పెయింటింగ్స్ వేయడంతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అడవులను పెంచాలని, మొక్కలను సంరక్షించాలని, వర్షం నీటిని ఒడిసి పట్టాలని, జంతువులు, పక్షులను కాపాడాలని.. పర్యావరణాన్ని పరిరక్షించాలని వేసిన బొమ్మ లు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. చుట్టూ ఎత్తైన గుట్టలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు.. ఆహ్లాదంతోపాటు అందాన్ని పంచుతున్నాయి.
చురుగ్గా గుంతలు తీసే పనులు
మండలంలోని ఐదు గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేశాం. వాటిలో ఇప్పటికే వివిధ రకాల మొక్కలను నాటడం పూర్తైంది. లక్ష్యం 50,000 మొక్కలు కాగా ఇప్పటివరకు 26,670 మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. మిగతా మొక్కలను కూడా త్వరలోనే నాటుతాం. అందుకోసం గుంతలు తీసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. బృహత్ పల్లె ప్రకృతివనాల చుట్టూ కంచె ఏర్పాటు చేసి ముఖ ద్వారాలను నిర్మిస్తాం. రాళ్లు, గుట్టలపై ఆహ్లాదాన్ని పెంచడంతోపాటు మంచి సందేశాన్నిచ్చే బొమ్మలను వేయిస్తాం. బృహత్ పల్లె ప్రకృతివనాల్లో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించి, వాటిని వృక్షాలుగా పెరిగేలా చూసి చిట్టడవులను పెంచుతాం. -విజయలక్ష్మి, ఎంపీడీవో యాచారం
మొక్కల పెంపకంతో లాభాలు
మొక్కల పెంపకంతో మానవులకు ఎన్నో లాభాలున్నాయి. సీఎం కేసీఆర్ మొక్కల పెం పకం కోసం హరితహారం, పల్లె ప్రకృతివనం వంటి కార్యక్రమాలను అమలు చేయడం హర్షణీయం. బృహత్ పల్లె ప్రకృతివనంలో దట్టమైన అడవిని తలపించేలా మొక్కలను నాటి సంరక్షించాలి. గ్రామాల్లోనూ ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేసి అందరూ మొక్కలు నాటి కాపాడేలా చర్యలు తీసుకోవాలి. -దూస రమేశ్, సర్పంచ్ తాటిపర్తి
మండలంలో ఐదు బృహత్ పల్లెప్రకృతి వనాలు..
మండలంలో ఐదు బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టగా.. ఇప్పటికే యాచా రం, తక్కళ్లపల్లితండా గ్రామాల్లో వాటి ఏర్పాటు పూర్తి కాగా.. తాటిపర్తి, నందివనపర్తి, చింతపట్ల గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ముఖ్యంగా తాటిపర్తిలో గుట్టలు, రాళ్లు, చెట్ల పొదలను జేసీబీలతో చదును చేసి బృహత్ పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేసి రోడ్డు మార్గాన్ని కూడా కల్పించారు. యాచారంలో ఆరు ఎకరాల్లో 21,000 మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా అధికారులు ఇప్పటివరకు 15,010 మొక్కలు నాటారు. తక్కళ్లపల్లితండాలో ఐదు ఎకరాల్లో పది వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా 8,300 మొక్కలు నాటారు. చింతపట్లలో ఐదు ఎకరాల్లో 1,200, నందివనపర్తిలో ఐదు ఎకరాల్లో 2,010, తాటిపర్తిలో ఐదు ఎకరాల్లో 150 మొక్కలను ఇప్పటి వరకు నాటారు. చింతపట్ల గ్రామంలో అదనంగా మరో ఐదు ఎకరాల్లో పది వేల మొక్కలను నాటేందుకు అధికారులు, సర్పంచ్ సరిత చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం గుంతలు తీయడం, మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతున్న ది. మండలంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిర్దేశించిన లక్ష్యా న్ని త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.