శంకర్పల్లి, ఆగస్టు 7: అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం.. ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడు విడుతలుగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడ, ఫలాలను ఇస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు, అటవీ ప్రాం తాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న మండలంలోని అన్ని గ్రామాలు పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పటివరకు 50వేల పై చిలుకు మొక్కలను నాటారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 26 నర్సరీలుండగా ఒక్కో నర్సరీలో 18 వేల చొప్పున మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున ఇప్పటివరకు 45 వేల మొక్కలను అధికారులు పంపిణీ చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం సమయాల్లో చిన్నారులు, వృద్ధులు పల్లెప్రకృతి వనాలకు వెళ్లి సేద తీరుతున్నారు.
గ్రామాలకు కొత్త కళ
హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామాలకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆయా గ్రామా ల కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. 50 వేల మొక్కలను నాటి జిల్లాలోనే శంకర్పల్లి మండలం ప్రథమ స్థానంలో నిలువడం సంతోషంగా ఉన్నది. -వెంకయ్య, ఎంపీడీవో
ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా..
హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతివనాల ఏర్పాటుతో మండలంలోని అన్ని గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో గ్రామాల్లో ఎంతో మా ర్పు వచ్చినది. ప్రభుత్వ సహకారంతో మండలంలోని అన్ని గ్రామా ల్లో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశా. శంకర్పల్లి మండలాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
-గోవర్ధన్రెడ్డి, ఎంపీపీ