అమీర్పేట్, జూలై 6: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించిన అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దంపతులు పూజలు నిర్వహించి రథాన్ని ముందుకు కదిలించారు. విద్యుత్ కాంతులు.. మేళతాళాలు, బాణాసంచా హోరుతో కళాకారులు నృత్యాల నడుమ అమ్మవారి రథం ఊరేగింపు దేవాలయం నుంచి ప్రారంభమై వీరాంజనేయ స్వామి దేవాలయం, గ్రీన్ల్యాండ్స్ హోటల్, పాత ఎస్ఆర్నగర్ పీఎస్ ముందు నుంచి కమ్యూనిటీ హాలు బీకేగూడ వార్డు కార్యాలయ చౌరస్తాల మీదుగా రాత్రి దేవాలయానికి చేరింది.
రథంపై వస్తున్న అమ్మవారికి భక్తులు స్వాగతాలు పలుకుతూ.. ప్రసాదాన్ని పంచి పెట్టారు. ఈ వేడుకల్లో అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో ఎస్.అన్నపూర్ణ, దేవాలయ పాలక మండలి సభ్యులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ఈ రథోత్సవంతో ముగిశాయి.