బంజారాహిల్స్, జూలై 6: ఆషాఢమాసం సందర్భంగా ప్రతి యేటా నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంతో పాటు గర్భగుడిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలతో అలంకరించారు. ఆల య ఫౌండర్ ట్రస్టీ ఇందిరా జనార్ధన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున 3 గంటలకు పెద్దమ్మ తల్లికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, చండీ పారాయణం, హోమం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. శాకాంబరీ దేవిగా దర్శనమిస్తున్న పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.