తాండూరు, జూలై 3: తాండూరును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గతంలో ప్రారంభమై నిలిచిన పనులతో పాటు ఇటీవల నిధులు కేటాయించి ప్రారంభించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల రూ.74 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. వీటికి తోడు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో ఖాంజాపూర్ గేట్ సమీపంలో 30 ఎకరాల స్థలంలో తాండూరు మార్కెట్ యార్డు, 12 ఎకరాల్లో అంతారం సమీపంలో ఆటోనగర్, జినుగూర్తి గేటు సమీపంలో పారిశ్రామిక వాడ నిర్మాణానికి 45 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ప్రజల్లో ఆనందం నెలకొంది.
అవసరం ఉన్నంత భూమిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ ధరల ప్రకారం ప్రత్యేక నిధులు కేటాయించింది. పనుల కోసం త్వరలో టెండర్లు పిలువనున్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పర్యటనలో వెనుకబడిన తాం డూరుకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో ముందెన్నడూ లేని అభివృద్ధి పనులు నేడు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో తాండూరు స్వరూపం మారుతున్నది. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల విమర్శలను ప్రజలే తిప్పికొడుతున్నారు. తాజాగా తాండూరుకు మార్కెట్ యార్డు, ఆటో నగర్, పారిశ్రామిక వాడ నిర్మాణాలకు భూమి కేటాయిస్తూ, పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.74 కోట్లు విడుదల కావడంతో ప్రజల్లో మరింత నమ్మకం పెరిగింది. మరో వైపు కుల సంఘాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి భూములు పరిశీలిస్తున్నారు.