పెద్దఅంబర్పేట, జూలై 2 : వేడుక ఏదైనా పాఠశాలలు వేదికగా మారుతున్నాయి. విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సంబురాలు నిర్వహిస్తూనే సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరిస్తున్నాయి. విద్యార్థులు సైతం ఆసక్తిగా భాగస్వాములవుతున్నారు. అందుకు తగ్గట్టే సిద్ధమై బడిబాట పడుతున్నారు. నగరంలోని పెద్ద పాఠశాలలకే పరిమితమైన ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు అన్నిచోట్లకు వ్యాపించాయి. పిల్లల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
జాతీయ దినోత్సవాలు
జాతీయ దినోత్సవాలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు వాటి ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు. ఓటరు దినోత్సవం మొదలు.. ఎయిడ్స్ డే వరకు ప్రతి అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. ఉదాహరణకు.. ఓటరు దినోత్సవం గురించి.. ఓటు ఎవరికి ఉంటుంది? ఎలా వినియోగించుకోవాలి? ప్రస్తుతం సమాజంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి? ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకపోతే కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి? అంటూ ప్రతి అంశాన్ని వివరిస్తున్నారు. ఇవే అంశాలపై పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిభచాటిన వారికి బహుమతులు అందజేస్తున్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతోపాటు సైన్స్ దినోత్సవం, ధరిత్రీ దినోత్సవం, రైతు దినోత్సవం, యోగా డే, ఆయుర్వేదిక్ డే, డాక్టర్స్ డే, ఇంజినీర్స్ డే, టీచర్స్ డే, ఆహార దినోత్సవం, వినియోగదారుల దినోత్సవం ఇలా ప్రత్యేక సందర్భాలున్న రోజులను ఉత్సవంగా జరుపుకొంటున్నారు. ప్రతి అంశంపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. యోగా దినోత్సవం రోజు పాఠశాలల్లో పిల్లలకు యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. యోగా పుట్టుపూర్వోత్తరాలను వివరిస్తున్నారు. అందరితో యోగా చేయిస్తున్నారు. సైన్స్ డేలో పిల్లలతో విజ్ఞానానికి సంబంధించిన ప్రయోగాలు చేయిస్తున్నారు. సైన్స్పై మక్కువ పెంచుకునేలా ప్రయోగాలు, సైన్స్ ఎలా మారుతున్నది, సైన్స్ సబ్జెక్టు ఎంచుకుని గొప్ప స్థానాల్లో ఉన్న ప్రముఖుల గురించి వివరిస్తున్నారు. విద్యార్థుల్లో విజ్ఞాన స్ఫూర్తిని నింపుతున్నారు.
సందడిగా పండుగలు
ఇక జనవరిలో వచ్చే సంక్రాంతి మొదలు.. ఏడాది చివరన డిసెంబర్లో వచ్చే క్రిస్మస్ వరకు అన్ని పండుగలను పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తున్నారు. పండుగల వెనుక ఉన్న చరిత్రను తెలియజేస్తూ సంస్కృతి సంప్రదాయాలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తున్నారు. రాఖీ పండుగ సమయంలో ఒకరితో ఒకరికి రాఖీ కట్టిస్తూ సోదరభావంతో ఉండాలని సూచిస్తున్నారు. బడుల్లోనూ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పలు పాఠశాలల్లో మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులతో తయారుచేయిస్తున్నారు. విద్యార్థులకే పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో ఉచితంగా అందజేస్తున్నారు. మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని, వీటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా చిన్నారులతో పతంగులను తయారుచేస్తూ.. వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని పలు పాఠశాలల్లో ముందస్తుగా వేడుకలు నిర్వహిస్తున్నారు. పిల్లలను సాంప్రదాయ దుస్తుల్లో సిద్ధమై రావాలని సూచిస్తున్నారు. ఉగాది పచ్చళ్లు పంపిణీ చేస్తున్నారు.
దినోత్సవాలపై అవగాహన
జాతీయ దినోత్సవాలను పాఠశాలల్లో నిర్వహించడం వల్ల పిల్లలకు కొంతవరకు అవగాహన వస్తుంది. ఆయా దినోత్సవాల ప్రాధాన్యం ఏమిటనేది తెలుస్తుంది. ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని స్ఫూర్తిని తీసుకుని ముందుకుసాగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే టీచర్స్ డే, సైన్స్డే వంటి విజ్ఞానాన్ని పంచే దినోత్సవాలను పిల్లలతో కలిసి నిర్వహిస్తున్నాం. యోగా, ధ్యానం వంటి అంశాలపైనా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలైన షీటీమ్స్ వంటివాటిపై కూడా చైతన్యం తీసుకొచ్చాం.
– జి.శ్రీనివాసరావు, జీహెచ్ఎం, కుంట్లూరు జడ్పీహెచ్ఎస్, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ