వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు పంటల సాగుపై దృష్టి సారించారు. ప్రభుత్వ సూచనల మేరకు చాలామంది రైతులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు వేసిన పంటల్లో పత్తి పంటనే అధికంగా సాగు చేశారు. ఇప్పటివరకు 33వేల పైగా ఎకరాల్లో పంటలు సాగుచేయగా.. ఇందులో 30 వేల ఎకరాల్లో పత్తి పంటనే సాగు చేయడం గమనార్హం. వానకాలానికి సంబంధించి జిల్లాలో మొత్తం 4,88,597 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసిన జిల్లా వ్యవసాయాధికారులు.. అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. సరిపడా ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 11,474 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు.
రంగారెడ్డి, జూన్ 27(నమస్తే తెలంగాణ): జిల్లాలో వారం, పది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఆయా పంటల సాగు మొదలైంది. అయితే వానకాలానికి సంబంధించి రైతులకు లాభాలను అందించాలనే లక్ష్యం మేరకు అధికారులు సాగు ప్రణాళికను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఏడాది కొన్ని పంటల సాగును తగ్గిస్తూ, మరికొన్ని పంటల సాగును పెంచాలని వ్యవసాయాధికారులు నిర్ణయించారు. అయితే ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో పత్తి పంట సాగును పెంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పటివరకు సాగైన పంటల్లో అత్యధికంగా పత్తి పంటనే రైతులు సాగు చేయడం గమనార్హం. మరోవైపు జిల్లా వ్యవసాయాధికారులు రూపొందించిన సాగు ప్రణాళికకు సరిపడా ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే యూరియా, డీఏపీ తదితర ఎరువులు అందుబాటులో ఉండగా రైతులు కొంతమేర ఎరువులను కొనుగోలు కూడా చేశా రు. జిల్లాలో పీఏసీఎస్, డీలర్లు, కంపెనీ గోదాంలు, మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే ఎరువుల సరఫరా జరుగుతున్నది. వానకాలానికి సంబంధించి యూరియా, డీఏపీ తదితర ఎరువులు అన్ని కలిపి 1,01,841 మెట్రిక్ టన్నుల అవసరమని అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు 11,474 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు కొన్నారు.
33,247 ఎకరాల్లో.. పంటల సాగు
రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆయా పంటల విత్తనాలను విత్తుతున్నారు. అయితే ఇప్పటివరకు 33,247 ఎకరాల్లో ఆయా పంటలు సాగుకాగా.. అందులో 95 శాతానికిపైగా పత్తి పంటనే రైతులు సాగు చేయడం గమనార్హం. ఇప్పటివరకు సాగైన ఆయా పం టల్లో 30,026 ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. ఈ సీజన్లో పత్తి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయాలని వ్యవసాయాధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వారి ప్రచారం సత్ఫలితాలను ఇస్తున్నది. రైతులు పత్తి సాగును అధికంగా చేపడుతున్నారు. అంతేకాకుండా పత్తికి మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతోపాటు చైనా, బ్రెజిల్ తదితర దేశాల్లో ఈ పంట సాగు తగ్గడంతో డిమాండ్ పెరిగినది. కాగా ఈ వానకాలంలో ఆయా పంటలు మొత్తం 4,88,597 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. అందులో పత్తి-2,75,050 ఎకరాల్లో, కంది-70,520, వరి-75,000, మొక్కజొన్న 48,000, జొన్న 15,000, పెసర్లు 352, వేరుశనగ 240, మినుములు 170, ఆముదం 120, సోయాబీన్ 20, ఇతర పంటలు 4,125 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 33,247 ఎకరాల్లో ఆయా పంటలు సాగుకాగా, పత్తి 30,026 ఎకరాలు, వరి-2,436, మొక్కజొన్న 1,441, కందులు-742, జొన్న 497, ఇతర పంటలను 535 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పత్తి సాగును 2.75 లక్షల ఎకరాలకుపైగా పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సరిపడా ఎరువులు, విత్తనాలు..
జిల్లాలో వానకాలానికి సంబంధించి సరిపడా ఎరువులు, విత్తనాలను అధికారులు అందుబాటు లో ఉంచారు. పత్తి-5,50,100 ప్యాకెట్లు, వరి-18,750 క్వింటాళ్లు, జొన్న-600, మొక్కజొన్న-3840, పెసర్లు-28, కందులు-2,820, మినుములు-13.6, వేరుశనగ-144, ఆముదం-3 , సోయాబీన్-7 క్వింటాళ్లు, ఇతర పంటలకు సంబంధించి 495 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు పత్తి-1,20,498 ప్యాకెట్లు, వరి-1,232 క్వింటాళ్లు, జొన్న-10, కందులు-110, మినుములు-7.85, పెసర్లు 0.3 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. అదేవిధంగా ఎరువులకు సంబంధించి జిల్లాకు యూరియా, డీఏపీ, ఎస్ఎస్పీ, ఎంవోపీ, కాంప్లెక్స్ ఎరువులు కలిపి 1,01,841 టన్నులు అవసరమని అంచనా వేయ గా, ఇప్పటివరకు 11,474 టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు యూరియా-4,769 టన్నులు, డీఏపీ-2,398, ఎస్ఎస్పీ-132, ఎంవోపీ-81, కాంప్లెక్స్ ఎరువులు-4,094టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేసి ఇండ్లల్లో సిద్ధంగా ఉంచుకున్నారు.
పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్
వానకాలానికి సంబంధించి జిల్లాకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సీజన్లో పత్తి పంట సాగును గణనీయంగా పెంచాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించగా.. సత్ఫలితాలు వస్తున్నాయి. రైతులు కూడా అధికంగా పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. -గీతారెడ్డి, రంగాడ్డి జిల్లా వ్యవసాయాధికారి