మర్పల్లి, జూన్ 26 : మీనాక్షిని స్ఫూర్తిగా తీసుకుని తోటి విద్యార్థులు చదువుకోవాలని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణకుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో విద్యార్థులకు ప్రభుత్వం టీ శాట్ చానల్ ద్వారా ఆన్లైన్ పాఠాలను ప్రసారం చేశామన్నారు. విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మైండ్ స్పార్క్ ప్రోగ్రాంను పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలుగు, గణితం, ఆంగ్లం సబ్జెక్టుల్లో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో విద్యార్థులకు మైండ్ స్పార్క్ ప్రొగ్రాం ప్రసారం చేసింది. ఈ ప్రొగ్రాంలో అధిక గంటలు ఉపయోగించుకున్న మర్పల్లి మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మీనాక్షిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన ట్యాబ్ను ఆదివారం పాఠశాల ప్రిన్సిపాల్ మీనాక్షికి అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, సల్మా, సంధ్యారాణి, వెంకటరమణ, విద్యార్థులు పాల్గొన్నారు.