నందిగామ, జూన్ 26 : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గురుస్వామి సతీషన్నాయర్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి పరిశీలించారు. ఆలయ ఆవరణలో 600 ఫీట్ల విస్తీర్ణంలో రూ.15లక్షల వ్యయంతో మట్టిని నింపేందుకు ముందుకు వచ్చిన నందిగామ సర్పంచ్ వెంకట్రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, ప్రతి ఒక్కరూ నిర్మాణ పనులకు సహకరించాలని కోరారు.
చేగూరులో పెట్రోల్ బంక్ ప్రారంభం
చేగూరు సర్పంచ్ మామిళ్ల సంతోష విఠల్ ఆధ్వర్యంలో చేగూరు రోడ్డులో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ను ఆదివారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, జడ్పీటీసీ విశాల, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, చేగూరు పీఏసీఎస్ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ పద్మారావు, సర్పంచ్లు గోవిందు అశోక్, జట్ట కుమార్, చంద్రారెడ్డి, నాయకులు దేవేందర్యాదవ్, వీరేందర్గౌడ్, శ్రీశైలం, కుమార్, కోస్గి శ్రీను, సములయ్య, విజయ్ పాల్గొన్నారు.
దళిత బంధుతో దళిత అభ్యున్నతికి శ్రీకారం
దళిత బంధు పథకం ద్వారా దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అక్కివేణిగూడకు చెందిన దళిత బంధు లబ్ధిదారుడు నరేందర్కు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ట్రాక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తిరిగి చెల్లించేలా రుణాలు ఇచ్చేవారని చెప్పారు. దళిత బంధు లబ్ధిదారులకు వారు కోరుకున్న యూనిట్ను అందిస్తున్నామని చెప్పారు.
యువత ‘మత్తు’కు బానిస కావొద్దు
యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా కొత్తూరు సీఐ బాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి బలం యువత అని.. వారు సరైన మార్గంలో నడిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అంతకు ముందు మత్తు పదార్థాలు వద్దు-ఆరోగ్యం ముద్దు అనే ప్లకార్డులు ధరించి కొత్తూరు పట్టణంలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య దేవేందర్యాదవ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొత్తూరు సీఐ బాలరాజు మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల వారి కుటుంబాలకు కలిగే నష్టాలను వివరించారు.
భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరస్వామి కల్యాణం
మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై సుదర్శన హోమం, కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ స్వామివారికి పూజలు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.