రంగారెడ్డి, జూన్ 25, (నమస్తే తెలంగాణ);వానకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులపై రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ఊరూరా అవగాహన కార్యక్రమాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. వ్యాధులను ఆదిలోనే నివారించేందుకుగాను గ్రామ పంచాయతీల్లో ఫీవర్ సర్వే చేసి లక్షణాలు ఉన్నవారికి మందులు పంపిణీ చేయనున్నారు. అవసరమైతే రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపనున్నారు.
సీజనల్ వ్యాధులపై రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైనది. వానకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేం దుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే డెంగీ, మలేరియా, డయేరియా వ్యాధులు ప్రబలుతుండటంతో సంబంధిత వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 12 డెంగీ కేసులు నమోదు కావడంతో.. ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన అధికారులతో వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశమై డెంగీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగం గా ఊరూరా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. డెంగీ, మలేరియా, డయేరియా వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మరోవైపు ఐదు విడుత ల్లో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో జిల్లాలో చాలా వరకు సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే చాలు గ్రామాల్లోని ప్రజలు రోగాల బారినపడిన పరిస్థితులుండేవి. అయితే ‘పల్లెప్రగతి’లో భాగంగా ప్రతి ఏటా వర్షాకాలానికి ముందు చేపడుతున్న స్వచ్ఛ కార్యక్రమాలతో సీజనల్ వ్యాధులు పూర్తిగా తగ్గాయి.
ఒకటి నుంచి అవగాహన కార్యక్రమాలు..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, జూలై ఒకటో తేదీ నుంచి గ్రామాల్లోనూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. గ్రామ పంచాయతీల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఫీవర్ సర్వే ను చేపట్టనున్నారు. దీని ద్వారా వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకొనున్నారు.
జిల్లా అంతటా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికెళ్లి ఫీవ ర్ సర్వేను నిర్వహించి జ్వరం, జలుబు, తలనొప్పి తదితర లక్షణాలను తెలుసుకోనున్నారు. ఏమైనా లక్షణాలుంటే ఇంటి వద్ద నే ఉచితంగా మందులను అందించనున్నారు. జ్వరం, జలుబు, తలనొప్పి తదితర లక్షణాలు మూడు, నాలుగు రోజులైనా తగ్గక పోతే సంబంధిత వ్యక్తుల రక్త నమూనాలను సేకరించి, పరీక్షల కు పంపనున్నారు. డెంగీ, మలేరియాగా నిర్ధారణ అయితే ప్లేట్లెట్స్ తగ్గకుండా ప్రత్యేక చికిత్స అందించనున్నారు. జిల్లాలోని అన్ని దవాఖానల్లో మలేరియా, డెంగీ వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
‘పల్లెప్రగతి’తో తగ్గిన సీజనల్ వ్యాధులు
స్వచ్ఛ గ్రామ పంచాయతీలే లక్ష్యంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఐదు విడుతల్లో చేపట్టిన కార్యక్రమాలతో క్రమంగా సీజనల్ వ్యాధులు తగ్గాయి. ఒకప్పుడు వానకాలంలో ఊరంతా రోగాల బారిన పడిన పరిస్థితుల నుంచి నేడు ఏలాంటి రోగాలు లేని గ్రామాలు గా పరిస్థితి మారింది. గత రెండు, మూడేండ్లుగా డెంగీ, మలేరియా కేసులతోపాటు ఇతర సీజనల్ వ్యాధుల కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. పల్లెప్రగతి ఐదు విడుతల్లో భాగంగా వానకాలం ప్రారంభానికి ముందే రోడ్లు, మురుగు కాల్వలను శుభ్రం చేయడం, ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపై పారకుండా ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి కుటుం బం ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. శ్రమదానం నిర్వహించి పిచ్చి మొక్కలను తొలగించడం, గ్రామా ల్లో పాడుబడిన బావులు, నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పూడ్చివేయడం వంటి కార్యక్రమాలతో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెరిగి సీజనల్ వ్యాధులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.