రంగారెడ్డి, జూన్ 22, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తీసుకువచ్చిన దృష్ట్యా అందుకనుగుణంగా పాఠ్య పుస్తకాలను సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోగా పాఠ్య పుస్తకాలు జిల్లాకు సరిపోను జిల్లా బుక్ డిపోకు రానున్న దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ జులై మొదటి వారంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 1309 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 13లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమని విద్యాధికారులు లెక్కతేల్చారు. ఇప్పటివరకు జిల్లా బుక్ డిపోకు 4.32లక్షల పుస్తకాలు చేరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మిగతా పాఠ్య పుస్తకాలు నాలుగైదు రోజుల్లో జిల్లాకు చేరనున్నాయి. మరోవైపు ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు తరగతులను నిర్వహిస్తున్నారు. బ్రిడ్జ్ కోర్సు తరగతుల్లో భాగంగా చదవడం, రాయడం, రీజనింగ్(గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం)లను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఈనెలాఖరులోగా త్రీఆర్స్లో విద్యార్థులు పట్టు సాధించేలా తరగతులను నిర్వహించనున్నారు. జులై మొదటి వారంలో సిలబస్ ప్రారంభంకానున్న దృష్ట్యా ఆలోగా పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
రెండు పార్టుల్లో పాఠ్య పుస్తకాలు
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని అమల్లోకి తీసుకువచ్చిన నేపథ్యంలో సరికొత్తగా పాఠ్య పుస్తకాలను ముద్రించారు. పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వేర్వేరుగా కాకుండా ఒకే పాఠ్య పుస్తకంలో ఒక పేపర్ ఇంగ్లిష్ పక్కనే మరో పేపర్లో తెలుగు భాషలో సిలబస్ ఉండేలా పాఠ్య పుస్తకాలను ముద్రించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే ఇంగ్లిష్ మీడియాన్ని అమలుచేస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేలా పాఠ్య పుస్తకాలను సిద్ధం చేశారు. మరోవైపు గణితం, సాంఘిక శాస్త్రం, సామాన్యశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి మొదటి పార్ట్ పాఠ్య పుస్తకాలను ప్రస్తుతం అందజేయనున్నారు. మొదటి పార్ట్లోని సిలబస్ పూర్తయ్యేలోగా రెండో పార్ట్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేయనున్నారు.
కొత్తగా 7529 మంది విద్యార్థులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలతో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడుతలో భాగంగా 464 పాఠశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించే పనులు కొనసాగుతున్నాయి. జిల్లా అంతటా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న దృష్ట్యా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 7529 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో కొత్తగా అడ్మిషన్ పొందారు. కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరినవారిలో ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా ప్రభుత్వ స్కూళ్లవైపు వస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల్లో ప్రీ ప్రైమరీ తరగతులకు 56 మంది, అంగన్వాడీ కేంద్రాల నుంచి 2288 మంది విద్యార్థులుకాగా, మిగతా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
జులై మొదటి వారంలో పుస్తకాలను అందజేస్తాం: సుశీందర్రావు, డీఈవో
జులై మొదటి వారంలోగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తాం. ఈనెలాఖరులోగా జిల్లాకు సరిపోను పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండనున్నవి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా ఒకే పాఠ్య పుస్తకంలో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో పుస్తకాలను ముద్రిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు త్రీఆర్స్పై తరగతులను నిర్వహిస్తున్నాం.