రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, జనవరి 6 : మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచింది. ఈమేరకు గురువారం మున్సిపాలిటీల్లోని ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్నవారితోపాటు పారిశుధ్య కార్మికులు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్కుమార్ జీవో జారీ చేశారు. పెరిగిన వేతనాలు 2021 జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.12వేల నుంచి రూ.15,600, బిల్ కలెక్టర్ల వేతనాలు రూ.15వేల నుంచి రూ.19,500, కంప్యూటర్ ఆపరేటర్లు, మేనేజర్ల వేతనాలు రూ.17,500 నుంచి రూ.22,750లకు పెరుగనున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 12 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో కలిపి 1150 మంది వరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 603 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉండగా.. తాండూరు మున్సిపాలిటీలో 213, వికారాబాద్లో 247, పరిగిలో 86, కొడంగల్ మున్సిపాలిటీలో 57 మంది ఉన్నారు. కేసీఆర్ తమ కష్టాలు తీర్చే సీఎం అని సిబ్బంది పేర్కొంటున్నారు. తమ వేతనాలు పెంచడం ఎంతో సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు.
30శాతం పెంచడం సంతోషంగా ఉంది : అరుణ్, బిల్ కలెక్టర్, వికారాబాద్
వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మాకు ప్రభుత్వం 30 శాతం వేతనం పెంచడం సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం శుభసందర్భంగా సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. నాలా పని చేస్తున్న ఎంతో మందికి ఇది చాలా అవసరం. వేతనం పెరుగడంతో కుటుంబ పోషణకు కొంతమేరకు ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక్కసారిగా 30 శాతం పెంచడం మాకు ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
సార్కు రుణపడి ఉంటాం:ఫకీరప్ప, పారిశుధ్య కార్మికుడు, కొడంగల్
పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచినందుకు సీఎం సార్కు సలాం. రోజూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. మా కార్మికుల కష్టాన్ని సీఎం గుర్తించి వేతనాలను పెంచడం ఆనందంగా ఉంది. ఈ పెంపుతో మరింత బాధ్యతగా పని చేస్తాం.
కేసీఆర్కు రుణపడి ఉన్నాం : సాయికృష్ణారెడ్డి
మున్సిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది సీఎం కేసీఆర్కు రుణపడి ఉన్నారు. వేతనాలు పెంచడం ఎంతో సంతోషం. సీఎం చేస్తున్న మేలును సిబ్బంది మరిచిపోలేరు. ఆయనకు అందరూ కృతజ్ఞులుగా ఉంటారు. మా బాధలు గుర్తించడం ఎంతో గర్వంగా ఉంది. ప్రజాసేవలో మరింత బాధ్యతగా విధులు నిర్వహించి సేవలను అందరికీ అందిస్తాం.