పూడూరు , డిసెంబర్ 30 : అందరి సమ్మతితోనే మైనింగ్ అనుమతులు ఇవ్వనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. గురువారం పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలో మైనింగ్ తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మీర్జాపూర్ గ్రామంలోని సర్వే నం.41లో 166 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా అందులో 130 ఎకరాల భూమి స్థానిక రైతులకు గతంలోనే వ్యవసాయ సాగుకై ఇచ్చారు. మిగులు భూమిలోని 26 ఎకరాల మైనింగ్ అనుమతులకై ఎస్సార్ మినరల్స్ సంస్థ 2017లో దరఖాస్తు చేసుకుంది. దీంతో గురువారం అదనపు కలెక్టర్ మోతీలాల్ అధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయగా.. కొందరు రైతులు తమ భూములను సర్వే చేసి తమకు హద్దులు చూపించాలని కోరారు. స్థానిక రైతులు, ఎన్జీవో (స్వచ్ఛంద సంస్థ)సభ్యులు వారి వారి అభిప్రాయాలను సమావేశంలో తెలుపగా అదనపు కలెక్టర్ రికార్డు చేసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఎస్సార్ మినరల్స్ సభ్యులు హాజరైన ఎన్జీవోలకు రవాణా చార్జీలు ఇస్తుండగా రైతులు, సంస్థ సభ్యుల మధ్య చిన్నపాటి గొడవ జరుగడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని సముదాయించి సంస్థ సభ్యులను పోలీసులు అక్కడి నుంచి పంపించారు. కార్యక్రమంలో మైనింగ్ ఏడీ సాంబశివుడు, తహసీల్దార్ కిరణ్కుమార్ ఉన్నారు.