చేవెళ్ల రూరల్/మంచాల, మే 28 : క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. అంతే కాకుండా క్రీడల్లో ప్రతిభ చూపితే ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ సౌకర్యం పొందవచ్చు. క్రీడల ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీతో పాటు అనుబంధ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అధికార యంత్రాంగం ఆయా గ్రామాల్లో మైదానాల ఏర్పాటు కోసం స్థలాలను సేకరిస్తున్నది.
చేవెళ్ల మండలంలో 20 ్రగ్రామాల్లో..
గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో స్థలాలు ఎంపిక చేసి మైదానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధ మవుతున్నారు. చేవెళ్ల మండల పరిధిలోని 37 గ్రామ పం చాయతీల్లో 11 అనుబంధ గ్రామాల్లో కూడా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల మండల పరిధిలో ఇప్పటికే సం బంధిత అధికారులు 20 గ్రామాల్లో స్థలాలను కేటాయించారు. చేవెళ్ల, కందవాడ, బస్తేపూర్, హస్తేపూర్, కౌకుంట్ల, తల్లారం, దామరగిద్ద, పామెన, మల్కాపూర్, కుమ్మెర, ముడిమ్యాల్, ఈర్లపల్లి, ఎన్కేపల్లి, కమ్మెట, గొల్లగూడ, గొల్లపల్లి, ఆలూర్, రావులపల్లి, సింగప్పగూడ, నాంచేరి గ్రామాల్లో మైదానాలకు స్థలాల కేటాయింపు పూర్తైంది.
చురుగ్గా పనులు..
క్రీడా మైదానాల ఏర్పాటులో అధికారులు స్థలాలను కేటాయించిన అనంతరం ల్యాండ్ లెవలింగ్, మట్టి పోసి చదును చేయుట, కమాన్ ఏర్పాటు, మైదానం చుట్టూ గుంతలు తవ్వి 300 మొక్కలు నాటేలా అనువుగా చేస్తున్నారు. క్రీడా మైదానం ఏర్పాటుకు రూ.4.17 లక్షల పైచిలుకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. వాలీ బాల్ పోల్స్, ఖోఖో, కబడ్డీ, లాంగ్ జంప్ హై జంప్, వ్యాయామం చేసే పరికరాలు, గ్రామీణ యువతకు క్రీడలు ఆడుకునేందుకు అనువైన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంచాల మండలంలో 24 క్రీడా మైదానాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 26 రెవెన్యూ గ్రామ పంచాయతీలుండగా అందులో ఇప్పటి వరకు 23 గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను గుర్తించారు. క్రీడా మైదానాల గుర్తింపు కోసం మండలానికి ప్రత్యేక అధికారిని గుర్తించగా అందులో క్రీడా స్థలాలను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు నివేదికను పంపనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటాం
మండల పరిధిలో 20 గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు స్థలాలు కేటాయించాం. మిగతా గ్రామాల్లో భూమి పరిశీలన చేస్తున్నాం. సర్పంచ్లతో మాట్లాడి స్థల సేకరణ చేస్తున్నాం. ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం. క్రీడామైదానాలు అనుకున్న సమయం మేరకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రాజ్కుమార్, ఎంపీడీవో, చేవెళ్ల
వేగంగా స్థలాల గుర్తింపు
ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాలతో పాటు అనుబంధ గ్రామాల్లో స్థలాలను గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మండలంలో 24 గ్రామాల్లో స్థలాలను గుర్తించి పనులను ప్రారంభించాం.
–తహసీల్దార్ దేవూజా, మంచాల