రంగారెడ్డి, మే 23, (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా మొదలయ్యాయి. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 459 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 47,516 మంది విద్యార్థులకుగాను 47,057 మంది పరీక్షలకు హాజరైనట్లు చెప్పారు. కరోనా నిబంధనలకనుగుణంగా జిల్లాలోని 282 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొదటి రోజు ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ అమయ్కుమార్ 2, డీఈవో 4, ఫ్లయింగ్ స్కాడ్స్ బృందాలు 80 పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించినట్లు డీఈవో తెలిపారు.
పరిగి, మే 23 : పదో తరగతి పరీక్షల మొదటి రోజు వికారాబాద్ జిల్లా పరిధిలో పరీక్షకు 226 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి తెలిపారు. జిల్లాలో సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు 14,440 మంది విద్యార్థులకుగాను 14,214 మంది, ప్రైవేటు విద్యార్థులు ఏడుగురికిగాను నలుగురు పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. జిల్లా పరిధిలోని వికారాబాద్ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలు, ధారూరు మండలం కెరెల్లి ఉన్నత పాఠశాల, అనంతగిరిపల్లిలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను వయోజన విద్యా అడిషనల్ డైరెక్టర్, పరిశీలకురాలు విజయలక్ష్మీబాయి, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి సందర్శించారు.