రంగారెడ్డి, మే 22 (నమస్తే తెలంగాణ): నేటి నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా బెంచీకి ఒక్క విద్యార్థినే కేటాయిస్తూ నిర్ణయించారు. అదేవిధంగా విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మాస్కులుంటేనే పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించనున్నారు. ఈ ఏడాది పరీక్షా కేంద్రాల సంఖ్యతోపాటు ఇన్విజిలేటర్ల సంఖ్య కూడా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండన్నునది.
నేటి నుంచి జూన్ 1తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదోతరగతి పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 47,516 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలు రు-24,071 మంది కాగా.. బాలికలు-23,489 మంది ఉన్నారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో 3,320 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు జిల్లావ్యాప్తంగా పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో కూడిన పది ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. వారితోపాటు 282 చీఫ్ సూపరింటెండెంట్లు, 282 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, మరో ఇద్దరు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, పదిమంది రూ ట్ అధికారులను నియమించారు. రంగారెడ్డి జిల్లాలో 282 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తి
పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తున్నాం. విద్యార్థులందరూ మాస్కులు ధరించి పరీక్షా కేంద్రాలకు రావాలి. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. విద్యార్థులు టెన్షన్కు గురి కాకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలి.
– అమయ్కుమార్, కలెక్టర్ రంగారెడ్డి జిల్లా