టీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలో వారసత్వ కట్టడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం ఉస్మానియా దవాఖానలో హోంమంత్రి మహమూద్ అలీ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, ఉస్మానియా వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికలతో కలిసి రోగి సహాయకులకు మూడు పూటల రూ.5 భోజనం క్యాంటీన్తో పాటు రూ.36కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా ఆర్థోపెడిక్ అకాడమిక్ బ్లాక్ను ప్రారంభించిన మంత్రి అక్కడి నుంచి ఓపీ, ఫార్మసీ బ్లాక్లతో పాటు ఆపరేషన్ థియేటర్లు, క్యూక్యూ భవనంలోని రెండు లిఫ్ట్లను ప్రారంభించారు. తరువాత రూ.5భోజన క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి రోగి సహాయకులతో కలిసి భోజనం చేశారు.
కోర్టులో కేసుతోనే..
అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ హెరిటేజ్ భవనానికి ఇబ్బంది లేకుండా ఉస్మానియాలో నూతన భవనాన్ని ఎలా నిర్మించాలనే అంశంపై కమిటీ వేశామని, ఇటీవల కమిటీ ప్రాథమిక నివేదిక వచ్చిందన్నారు. హెరిటేజ్ భవనానికి ఇబ్బందులు లేకుండా నూతన భవన నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు తయారవుతున్నట్లు వివరించారు. ప్రతిపాదనలు, కమిటీ తుది నివేదిక వచ్చిన వెంటనే వాటిని సీఎం దృష్టికి తీసుకువెళ్లి క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకుంటామన్నారు. వాస్తవానికి మొట్టమొదట నిర్మాణం ఉస్మానియా నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అనుకున్నారని, అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఇక్కడకు వచ్చి, పరిశీలించి రూ.250కోట్లు మంజూరు చేశారని తెలిపారు. దురదృష్టవశాత్తు కొంతమంది కోర్టుకు వెళ్లడం, అడ్డుపడటం మూలంగా నిర్మాణ పనుల్లో ఆలస్యం జరుగుతున్నదని చెప్పారు. నగరంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మిస్తున్నామని, అలాంటిది ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధిని కొందరు ఆపాలని చూస్తే ఆగేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన సాయశక్తులా పనిచేస్తున్నదని, దానికి మీడియా సపోర్టు కూడా కావాలని కోరారు. చిన్న తప్పును భూతద్దంలో పెట్టి చూపుతున్నారని, అలాగే మంచి పనులను కూడా చూపాలని విజ్ఞప్తి చేశారు.
రూ.36కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
నగరంలోని 17 దవాఖానల్లో మూడు పూటలా భోజన కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి హరీశ్రావు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 17 దవాఖానల్లో ప్రతి రోజు 20వేల మందికి భోజనాలు అందించాలనే లక్ష్యంతో.. ఈ పథకానికి రూ.40 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఉదయం పూట పెరుగన్నం లేదా వెజ్ బిర్యాని లేదా సాంబర్ రైస్, మధ్యాహ్నం మంచి భోజనం, రాత్రికి డిన్నర్ అందించనున్నట్లు తెలిపారు.
పేదల ఆకలి తెలిసిన వ్యక్తి.. సీఎం కేసీఆర్
పేదల ఆకలి బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ చేపట్టిన మరో అద్భుత పథకమే ‘మూడు పూటలా భోజనం’ అని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం గాంధీ దవాఖానలో రోగుల సహాయకుల కోసం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా కేవలం రూ.5కే కడుపు నిండా భోజనం పెట్టే పథకాన్ని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రోగి సహాయకులతో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తమలాంటి వారి కోసం సీఎం కేసీఆర్ మూడు పూటలా భోజనం అందించడం పట్ల వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హరేరామ.. హరే కృష్ణ మూవ్మెంట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రభుత్వం నగరంలోని 17 సర్కారు దవాఖానల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని అన్నారు. ప్రతి రోజు రెండు వేల మంది వచ్చే గాంధీ దవాఖాన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గాంచడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం, మందులు, డయగ్నోస్టిక్ సెంటర్ ద్వారా పరీక్షలు, సిటీ స్కాన్ లాంటి వైద్య సేవలన్నీ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహారావు నేత, ఆర్ఎంఓలు డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డాక్టర్ వెంకటరమణ, టీఆర్ఎస్ నాయకులు జి.పవన్కుమార్ గౌడ్, కె.లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, వెంకటేశన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
రూ.60 భోజనం.. రూ.5కే
కొండాపూర్ జిల్లా దవాఖానలో అరెకపూడి గాంధీ ప్రభుత్వ దవాఖానలకు వస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు రూ.5లకే కడుపునిండా భోజనం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో రూ.5భోజన పథకాన్ని కార్పొరేటర్లు హమీద్ పటేల్, శ్రీకాంత్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వరదాచారితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.60 విలువ చేసే నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని రూ.5కే అందజేస్తున్నామని చెప్పారు. దవాఖానలో అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఛాతి దవాఖానలో ఎమ్మెల్యే మాగంటితో..
వెంగళరావునగర్, మే 12 : సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఎర్రగడ్డలోని ఛాతి దవాఖానలో రోగి సహాయకుల కోసం ఏర్పాటు చేసిన రూ.5 భోజన కేంద్రాన్ని గురువారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎయిమ్స్ తరహాలోనే నగరం నలుమూలల టిమ్స్ సూపర్స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం జరుగనున్నదని తెలిపారు. హరీశ్రావు ఆరోగ్య మంత్రి అయిన తర్వాత వైద్య అవసరాలు తెలుసుకొని అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నారని కొనియాడారు. ఐఏఎస్ ఆధికారి డాక్టర్ ప్రీతి మీనా, ఛాతి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్, కార్పొరేటర్ దేదీప్య విజయ్, డాక్టర్ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం.. తెలంగాణ వైద్య విధానం
తెలంగాణ ప్రభుత్వ వైద్య విధానం దేశానికే ఆదర్శంగా మారిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన రూ.5కే భోజనం క్యాంటీన్ను గురువారం ఎమ్మార్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చికిత్స నిమిత్తం వచ్చిన పేదలు ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో రూ.5కే భోజనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, అందులో భాగంగా క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్యాంటీన్ల ద్వారా పేదలకు మూడుపూటలా కడుపునిండా రుచికరమైన భోజనం వడ్డించనున్నారని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందన్నారు. ప్రతి దవాఖానలో రోగుల కోసం వచ్చే వారికి విశ్రాంతి హాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ వైద్యం కోసం దవాఖానకు వచ్చే వారికి ఎలాంటి సమస్య తలెత్తవద్దని సీఎం కేసీఆర్ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ఇక నుంచి ప్రతి ప్రభుత్వ దవాఖానలో రోగుల సహాయకులకు మూడుపూటలా భోజనం అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ హరిప్రియ, ఆర్ఎంవో రాజు, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్రెడ్డి, చింతల రవికుమార్ గుప్త, పోగుల రాంబాబు, వైద్యులు, నాయకులు పాల్గొన్నారు.
మెరుగైన వసతులు కల్పిస్తున్నాం
గ్రేటర్లోని అన్ని దవాఖానల్లో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం.
ఇటీవల రోగులకు డైట్ చార్జీలను సైతం రెట్టింపు చేశాం, దీంతో ప్రభుత్వంపై రూ.43కోట్లకు పైగా భారం పడుతుంది.
పారిశుధ్యం కోసం ఒక్కో బెడ్కు చెల్లించే మొత్తం 5000 నుంచి 7500కు పెంచాం. ఎస్సీ రిజర్వేషన్లు కూడా ఇచ్చాం.
రూ.2679కోట్లతో 3సూపర్స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేశాం.
సూపర్స్పెషాలిటీ దవాఖానల్లో వైద్యం, విద్య, పరిశోధనలు వంటి వాటిని అందుబాటులోకి తేనున్నాం.
టిమ్స్లో 1000, నిమ్స్లో 2000 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నాం.
రోగి సహాయకుల కోసం షెల్టర్లను నిర్మించనున్నాం.
వైద్యాధికారుల కోసం ప్రత్యేకంగా క్వార్టర్స్ను ఏర్పాటు చేయనున్నాం.
అల్వాల్లో ఎంసీహెచ్ దవాఖానను అందుబాటులోకి తీసుకువస్తాం.
జిల్లాల్లో సైతం క్యాథల్యాబ్స్ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి.
నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆస్పత్రుల్లో ఉన్న ఫైర్సేఫ్టీ సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేశాం. త్వరలోనే పరికరాలను ఏర్పాటు చేస్తాం.
ఉస్మానియాలో రూ.3.5కోట్లతో 75పడకల ఐసీయూను ఏర్పాటు చేస్తున్నాం. గురువారం 40పడకల ఐసీయూను ప్రారంభించారు.
ఉస్మానియా దవాఖానలో రూ.6కోట్ల వ్యయంతో ఆధునిక మార్చురీ ఏర్పాటు చేస్తున్నాం.
మూడు, నాలుగు కోట్లతో ఆర్థోపెడిక్ కాంప్లెక్స్ను నిర్మిస్తాం. ఎన్ఏబీహెచ్ కింద రూ.10కోట్లు మంజూరు.