సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో తమకు అనుకూలంగా ఉన్న వివాహ చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని గృహ హింస కేసులు ఎదుర్కొంటున్న కొందరు నిందితులు ఆరోపించారు. వాస్తవానికి ఆ కేసుల్లో నిందితులుగా తమ పేరు ఉన్నప్పటికీ తామే అసలైన బాధితులమని, నష్టపోయింది తామేనని వాపోయారు. లింగ సమానత్వం గురించి మాట్లాడే వారు.. సమాన హక్కులు కావాలనే తమ న్యాయమైన కోర్కెలకు మద్దతు పలకాలని కోరారు. కొన్ని కేసుల్లో అన్యాయంగా తమ తల్లిదండ్రులతో పాటు తోడబుట్టిన వారిని కూడా కేసుల్లోకి లాగి కసి తీర్చుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తాము మహిళా హక్కులకు అడ్డు కాదని, డబ్బుల కోసం తప్పుడు కేసులు మోపి పీడించొద్దని విజ్ఞప్తి చేశారు. భార్యలు పెట్టిన వేధింపుల వల్ల మానసిక రుగ్మతలకు కొందరు భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్నేండ్లుగా పురుషుల హక్కుల కోసం పని చేస్తున్న సిఫ్ వ్యవస్థాపకుడు అనిల్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పలువురు తమపై పెట్టిన తప్పుడు కేసుల నేపథ్యాలను చెప్పుకొచ్చారు. నేషనల్ మెన్స్ రైట్స్ పేరుతో జరిగిన ఈ సదస్సుకు దాదాపు 200 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్లు కృష్ణ, మాధవ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గృహ హింస కేసు నేపథ్యాలను తెలియజేస్తూ తాము ఎలా బాధితులుగా మిగిలిపోయామో వివరించారు.
498/ఏ సెక్షన్ అంటే..
భార్యను భర్త హింసించి, వేధింపులకు పాల్పడే చర్యలపై ఫిర్యాదు అందినప్పుడు పోలీసులు 498/ఏ సెక్షన్ కింద కేసును నమోదు చేస్తారు. ఈ అభియోగం రుజువైతే ఆరు నెలల నుంచి 3 ఏండ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇది బెయిలబుల్, కంపౌండబుల్ కేసు. భార్యను వేధించడంలో భర్తకు సహకరించారని బాధితురాలు ఫిర్యాదు చేస్తే వారందరికీ ఈ సెక్షన్ వర్తిస్తుంది. అయితే దీనికి వరకట్నం వేధింపులు తోడైతే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ చాలా కఠినంగా ఉంటుంది. డౌరీ, ప్రొహిబిషన్ యాక్ట్ నమోదైతే అది నాన్ కంపౌండబుల్ కేసుగా పరిగణిస్తారు. ఈ కేసులో రాజీ కుదరదు. కోర్టు విచారణ జరగాల్సిందే.
వేధిస్తే ఎంత కాలం తట్టుకోగలం?
ఇష్టంలేని పెండ్లి చేశారని 11 రోజులకే మా కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఆమెకు ఇష్టం లేకుంటే నాతో విడిపోవాలి. కానీ వాళ్ల తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు గృహహింస, వరకట్నం కేసులు పెట్టి నన్ను వేధిస్తున్నారు. ఇట్లా వదిలించుకోవడానికి తప్పుడు కేసులు నమోదు చేస్తే ఏమి లాభం? మానసికంగా వేధింపులకు గురిచేస్తే ఎంత కాలం తట్టుకోగలం? ఎంతో పేరున్న కుటుంబాన్ని బజారుకు ఈడ్చి రచ్చచేస్తే పరువు పోదా? సెటిల్మెంట్ చేసుకోవాలంటూ.. మధ్యవర్తులు ఒత్తిడి తెస్తున్నారు. ఆమెకు ఇష్టం లేకుంటే.. నేను ఆర్థికంగా, మానసికంగా నష్టపోవాలా? ఇది మంచిపద్ధతి కాదు.
– మాధవ్ పాటిల్, బాలానగర్
మీ అమ్మా నాన్నలను వదిలేయ్!
‘నేను అమ్మా నాన్నలను వదిలి వచ్చాను.. నువ్వు కూడా మీ అమ్మానాన్నలను విడిచి పెట్టాల్సిందే’ అని నాకు హుకుం జారీ చేస్తున్నది మా ఆవిడ. అమ్మా నాన్నలతో కలిసి ఉండాలని నాకు ఉంది. బాధైనా, సంతోషమైనా కలిసి పంచుకోవాలనేది నా తపన. బాధ్యతగా మెదలాలన్నది నా ఆలోచన. కానీ నా భార్య అందరి నుంచి దూరంగా ఉండాలని నాకు వార్నింగులు ఇస్తున్నది. నాకు ఇద్దరు పిల్లలు. విడిపోతే వారి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళనతో ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది నా పరిస్థితి. నా వేదనను ఎవరితో పంచుకోవాలి. ఏ దేవుడికి నివేదించాలి. ఇటువంటి సందర్భం శత్రువులకు కూడా రాకుడదు.ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి?
– ముచ్చేందర్, విప్రో ఉద్యోగి, రాంనగర్
తప్పుడు కేసులు ఆపాలి
తప్పుడు కేసులను ప్రభుత్వాలు అడ్డుకోవాలి. తప్పుడు కేసులను పెట్టే ముందు అధికారులు వాస్తవాన్ని తెలుసుకోవాలి. మానవ హక్కులు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలి. విడిపోతున్న జంటల పిల్లలకు తప్పని సరిగా షేర్డ్ పేరెంటింగ్ (ఇద్దరికీ బాధ్యతలు) లేదా షేర్డ్ కస్టడీ (ఇద్దరికీ పెంపకం బాధ్యతలు) ఇచ్చేలా చట్టాలను మార్చాలి. గృహహింస చట్ట బాధితులైన పురుషులకు చట్టం నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నాం.
– గణేశ్, సిఫ్ సౌత్ఇండియా కోఆర్డినేటర్
కుటుంబ కలహాలే మనోరుగ్మతలకు కారణం
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం ప్రతి ఏటా మహిళలకంటే పురుషులే ఎక్కువ ఆత్మన్యూనతకు లోనై ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. మనోరుగ్మతలకు కారణం కుటుంబ కలహాలే. ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబంతోపాటు సమాజం కూడా బాగుంటుంది. అందుకే లింగ సమానత్వంతో పాటు ఆడ, మగ తేడా లేకుండా సమాన హక్కులు రావాలని కోరుతున్నాం. మెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అనే నినాదంతో పనిచేస్తున్నాం. 125, 323, 377, 498, 506 సెక్షన్ల ద్వారా చాలా సందర్భాల్లో పురుషులకు తీరని అన్యాయం జరుగుతున్నది. దీంతో పాటు తీవ్ర మనోవేదనకు గురై ఆనారోగ్యాల పాలవుతున్నారు.
– ఆనంద్, సీనియర్ కౌన్సెలర్ సిఫ్
నెల నెలా అమెరికా నుంచి రావాలా?
పెండ్లి అనగానే.. మాంసపు ముద్దల కోసం వేచి చూసే గద్దల్లాగా.. మధ్యవర్తిత్వం వహించేందుకు ముఠాలు ఏర్పడుతున్నాయి. హిందూ వివాహ వ్యవస్థ ఇట్లా తయారు కావడానికి కారణం చట్టాలను దుర్వినియోగం చేయడమే. తప్పుడు నిర్ణయాల వల్ల ఇరు కుటుంబాలు బాధపడుతుండటం తప్ప లాభమైతే లేదు. కొన్ని రాష్ర్టాల్లో స్టేషన్ బెయిల్ దొరుకుతుంది. కానీ నార్త్ ఇండియాలో డైరెక్టుగా కోర్టుల్లో హాజరయ్యే వరకూ బెయిల్ దొరకడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులను చూస్తామని జీవితంలో ఎన్నడూ అనుకోలేదు. ఎన్ఆర్ఐలను వారానికి, నెలకోసారి ప్రత్యక్షంగా వచ్చి తమ ముందు హాజరవ్వాలని కోర్టులు ఆదేశిస్తే అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఎట్లా రాగలరు? ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఏమిటి పరిష్కార మార్గం?
నా దుస్థితి వేరెవరికీ రావొద్దు
నాపై భార్య తప్పుడు కేసులు మోపింది. తన తల్లి, సోదరుడి ప్రోద్బలంతో వేధిస్తున్నది. 11 ఏండ్ల కూతురును నేను చూడకుండా దూరం పెట్టింది. 2017 నుంచి మనోవేదన అనుభవిస్తూ కుంగిపోయాను. కూతురును చూడాలని కోర్టుకు వెళ్లగా..నెలలో రెండో శనివారం, నాలుగో ఆదివారం 2గంటలపాటు కూతురును చూడొచ్చని అనుమతిచ్చింది. ఇటీవల నా కూతురు అమెరికా వెళ్లాలని ప్లాన్ వేసుకొని సింగిల్ పేరెంట్ విధానం ద్వారా పాస్పోర్టుకు దరఖాస్తు చేశారు. అంటే ఇప్పుడు నేను నా కూతురును చూసుకునే భాగ్యం కూడా లేదా? ఇప్పుడు నేనేం చేయాలి ? మిగిలింది ఎవరి కోసం? ఈ దుస్థితి ఇంకెవరికీ రావొద్దు.
– శివప్రకాశ్, ఒడిషా (బెంగళూరులో ఉద్యోగి)