ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 4: పట్టణాల్లో నివసించే నిరుపేదలకు సత్వర వైద్యం అందించేందుకు ప్రభుత్వం జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో నివసిస్తున్న పేదలకు కూడా సత్వర వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న ది. ఇందులో భాగంగానే అన్ని మున్సిపాలిటీల పరిధిలో 24 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని, జూన్ 2వ తేదీ నుంచి వాటిని ప్రారంభించాలని నిర్ణయించింది. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, బడంగ్పేట, పహాడిషరీఫ్, మీర్పేట, జల్పల్లి, మణికొండ, శంషాబాద్, నార్సింగ్ మున్సిపాలిటీల్లోని 24 ప్రదేశాల్లో వీటిని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో 60బస్తీ దవాఖానలను ఏర్పా టు చేయాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అందులో 38 బస్తీ దవాఖానలను నగర శివారులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటికే ప్రారంభించిం ది. కొత్తగా మరో 24 చోట్ల బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాలో ఏర్పాటు చేసిన 38 బస్తీ దవాఖానలతో ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువయ్యా యి. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది.
ఏర్పాటు చేసే విధానం..
ఆయా మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానల ఏర్పాటుకు జనాభా ప్రాతిపదికతోపాటు వైద్యసేవలు అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యం అం దుబాటులో ఉన్న మూడుకిలోమీటర్ల దూరంలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ఇప్పటికిప్పుడే బస్తీ దవాఖానల కో సం భవనాన్ని నిర్మించడం కష్ట సాధ్యం కావడం తో అందుబాటులో ఉన్న కమ్యూనిటీహాళ్లు, ప్రభుత్వ భవనాలను వినియోగించుకోనున్నారు. బస్తీ దవాఖానల్లో ఒక మెడికల్ అధికారి, ఒక స్టాఫ్నర్సు, ఇద్దరు సహాయకులు అందుబాటులో ఉంటారు. టీ డయాగ్నోస్టిక్ సహకారంతో ఎక్కడికక్కడ రక్తనమూనాలను సేకరించి రోగనిర్ధ్దారణ పరీక్షలు చేయనున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలతో పేదలకు ఆర్థిక భారం తగ్గనున్నది. బస్తీ దవాఖానల్లో ఉచితంగా పరీక్షలతోపాటు మందులను కూడా అందజేస్తారు.
జూన్ 2 నుంచి ప్రారంభించే యోచన
బస్తీ దవాఖానలను జూన్ 2 వ తేదీ నుంచి ఆయా మున్సిపాలిటీల్లో దశలవా రీగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీల వారీగా కేటాయించిన ప్రాంతాల్లో అందుబాటు లో ఉండే ప్రభుత్వ భవనాలను ఎంపిక చేసి ప్రక్రియను ప్రారంభించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటు లో ఉన్న కమ్యూనిటీహాళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలను అధికారులు గుర్తించారు.
మున్సిపాలిటీల్లో కొత్తగా 24 ప్రాంతాల్లో..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో కొత్తగా 24 ప్రాంతాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలోని పసుమాముల పోచమ్మకాలనీలో, తట్టిఅన్నారంలోని మర్పల్లి గ్రామంలో, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లోని కమ్మగూడ ఇందిరమ్మకాలనీలో, రాగన్నగూడలోని ఎన్ఎస్ఆర్నగర్ కాలనీలో, ఆదిబట్ల మున్సిపాలిటీలోని హరిజనవాడలో, శంషాబాద్ మున్సిపాలిటీలోని కాపుగడ్డలో, ఇందిరానగర్లో, బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని జాంగీర్నగర్లోని కిస్మత్పూర్లో, గంధంగూడలో, మణికొండ మున్సిపాలిటీలోని శివపురికాలనీలో, నార్సింగ్ మున్సిపాలిటీలోని కోకాపేటలో, ఖానాపూర్లో, బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్లో, రంగనాయకుల కాలనీలో, వెంకటాపురంలో, మీర్పేట్ మున్సిపాలిటీలోని లెనిన్నగర్లో, అంబేద్కర్నగర్లో, లలితానగర్లో, తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఎస్సీకాలనీలో, జల్పల్లిలోని శ్రీరాంనగర్కాలనీలో, షాహీన్నగర్లో, పహాడీషరీఫ్లో, ఎల్బీనగర్లో, శేరిలింగంపల్లిలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పేదలకు సత్వర వైద్యం అందించేందుకే..
జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని పేదలకు కూడా సత్వర వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్యసేవలు అందుతుండటంతోపాటు రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది. బస్తీ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందుతుండటంతో మరిన్ని దవాఖానాలను ఏర్పాటుచేయాలని ప్రజల నుంచి వినతులు వస్తుండటంతో జిల్లాలో మరో 24 ప్రాంతాల్లో బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
–స్వరాజ్యలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా
పేదలకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి
ప్రభుత్వం మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం అభినందనీ యం. బస్తీ దవాఖానల ఏర్పాటుతో పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యంతోపాటు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు కూడా అక్కడి వైద్యులు అందిస్తారు. దీంతో వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి.
–శ్రీనివాస్రెడ్డి, బొంగుళూరు