ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 19 : సీతాఫల్మండిలోని కుట్టి వెల్లోడీ ప్రభుత్వ ఆస్పత్రి (అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11.6 కోట్లు మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సైతం ప్రభుత్వం జారీ చేసిందని చెప్పారు. ఆస్పత్రిలోని భవనాలు శిథిల స్థితికి చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని వివరించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన సోమవారం పరిశీలించారు. రూ.6 కోట్లతో లాలాపేటలో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్, రూ. 6 కోట్లతో లాలాపేటలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, అడ్డగుట్టలో రూ.2.25 కోట్లతో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కుట్టి వెల్లోడీ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో పద్మారావుగౌడ్ మాట్లాడుతూ రోజూ కనీసం పది మంది గర్భిణులు, సుమారు 200 మంది సాధారణ రోగులకు ఓపీ సేవలు, ఉచితంగా మందులు అందుతున్నాయని తెలిపారు. సుమారు 900 గజాల స్థలంలో ఉన్న ఈ ఆసుపత్రిని కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన భవన నిర్మాణానికి తాము ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం రూ.11.6 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిందని చెప్పారు. తమ అభ్యర్థనకు వెంటనే స్పందించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో నూతన భవనాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆసుపత్రిని తరలించేందుకు సహకరించాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లను కోరారు. త్వరితగతిన ఆస్పత్రి భవనాలను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో పాటు బీఆర్ఎస్ యువ నేతలు కిశోర్కుమార్, కిరణ్కుమార్, రామేశ్వర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.