తుర్కయాంజాల్, డిసెంబర్ 17 : విద్యార్థుల్లో శాస్త్ర, పరిశోధన జ్ఞానం పెంపొందేలా విద్యా బోధన ఉండాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలోని కేబీ సైన్స్ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పరిశోధన, శాస్త్ర శిక్షణ సంస్థ సౌజన్యంతో యూనిసెఫ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యపై ఒక్క రోజు శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని పరిశోధన రంగాల్లో రాణించేలా శిక్షణను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి వారికి నూతన విషయాలను బోధించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థ్ధులు అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉపాధ్యాయుల కృషి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వై.శ్రీనివాసరావు, ఎస్ఐసీ సిబ్బంది రాజశ్రీ, ధృవ, కేబీ స్కూల్ చైర్మన్ సీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.