బొంరాస్పేట, డిసెంబర్ 13 : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం దుద్యాలలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో దొంగతనాలు, నేరాలు చేసినప్పుడు సీసీ కెమెరాల సాయంతో గుర్తించవచ్చన్నారు. దుద్యాల గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతర గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. మైనర్లు వాహనాలు నడుపడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలో జాతీయ రహదారి విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరుగకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడుపరాదన్నారు.
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేరాలను అదుపు చేయడానికి మూడో కన్నులా పని చేస్తాయన్నారు. సీసీ కెమెరాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరిగినా వెంటనే తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను అందజేసిన రఫీక్ను ఎస్పీ, ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహ్మద్ ఖాజా, పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డి, కొడంగల్ సీఐ శంకర్, బొంరాస్పేట ఎస్సై ఎండీ నయీమొద్దీన్, ఎంపీటీసీ ఎల్లప్ప, బీఆర్ఎస్ పార్టీ దుద్యాల మండల అధ్యక్షుడు చాంద్పాషా, నాయకులు పాల్గొన్నారు.