ఆదిబట్ల, డిసెంబర్ 10 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో 32 మంది నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నవీన్రెడ్డితోపాటు మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేసి, రిమాండ్కు తరలించారు. ఆదిబట్ల సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ సిరిటౌన్షిఫ్లో రిటైర్డ్ ఆర్మీ దామోదర్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. తన కూతురు వైశాలి డెంటల్ డాక్టర్గా చదువుతున్నది. వైశాలికి నవీన్రెడ్డికి కొంత కాలంగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతి కుటుంబీకులు ఒప్పుకోలేదు. తమ బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి నిర్ణయించారు. శుక్రవారం యువతి ఇంట్లో తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించారు. దీంతో నవీన్రెడ్డి శుక్రవారం ఉదయం యువతి ఇంటిపై తనకు తెలిసిన 36 మంది మిస్టర్ టీ పాయింట్లలో పని చేస్తున్న యువకులతో వెళ్లి యువతి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న సామగ్రిని పగులగొట్టారు. అడ్డు వచ్చిన యువతి తల్లిదండ్రులపై దాడి చేశారు.
32 మంది అరెస్ట్..
కిడ్నాప్ కేసులో 32 మందిని అరెస్ట్ చేశారు. అందులో నాగారం బానుప్రకాష్, రాథోడ్ సాయినాథ్, నాగారం కార్తీక్, గానోజి ప్రసాద్, కోతి హరి, రాథోడ్ అవినాష్, అరిగేల రాజు, సోను కుమార్, మహ్మద్ ఈర్పాన్, నీలలే కుమార్, బిట్టు కుమార్, పూన నికిల్, ఈలావత్ అనీల్, మహేశ్కుమార్, ఎండీ రిజ్వాన్, జావిద్హుసెన్, ఎండీ ఇబ్రాహర్, బోడుపల్లి సతీశ్, మహ్మద్ ముక్రామ్, బిస్వాజిత్, ఆంబోత్ యోగేందర్, నారా గోపిచంద్, బట్టు యశ్వంత్, ముప్పల మహేశ్, వంకాయల పాటీ మనదీప్, బోని సిద్ధు, జడావ్ రాజేందర్, దామార గిద్ద శశికిరణ్, శివిరాల రమేశ్, మలిగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి లను అరెస్ట్ చేశారు. వీరికి ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేసి, కోర్టులో హాజరు పరిచారు. ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి, మరో ముగురు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీఐ పేర్కొన్నారు. అరెస్ట్ అయినవారిలో ముగ్గురు ఆయ్యప్ప మాల ధరించి ఉన్నారు.
ఇంటిపై చేయడం తప్పే : నిందితుడి తల్లి నారాయణమ్మ
నా కొడుకు కష్టపడి సంపాదించాడు. నవీన్ ఆ అమ్మాయి ప్రేమించుకున్నారు. రెండేండ్లుగా కలిసి తిరిగారు. మా ఇంటికి కూడా చాలా సార్లు ఆమ్మాయి వచ్చింది. కరోనా సమయంలో ప్రతి రోజు ఆమ్మాయిని కాలేజ్ వద్ద కారులో దింపి వచ్చేవాడు. పెండ్లి చేసుకున్నట్లు చెప్పాడు. మా కొడుకు వద్ద యువతి తండ్రి దామోదర్రెడ్డి వ్యాపారం కోసం డబ్బులు కూడా తీసుకున్నాడు. వాళ్ల కోసమే కారు కొన్నాడు. కానీ అమ్మాయి ఇంటిపై జరిగిన దాడి తప్పే.. కానీ ఇంతకు ముందు జరిగిన విషయాలు కూడా మీడియా చూపించాలి. మా కొడుకుకు మంచి సంబంధాలు వస్తున్నాయని చెప్పినా వినిపించుకోలేదు.