రంగారెడ్డి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మారుమూల గ్రామాలకు సైతం నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఇప్పటికే పల్లె, పట్టణ దవాఖానలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నది. ఈ దవాఖానలను మరింత బలోపేతం చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు అదనపు సిబ్బంది నియామకంపై దృష్టి సారించింది. జిల్లాకు మరో 50 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దవాఖానాల్లో ఓపీతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. జిల్లాలో ఇప్పటికే 21 యూపీహెచ్సీ కేంద్రాలు, రెండు సామాజిక (కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు) ఉన్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాకు మరో తొమ్మిది పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఏర్పాటుకు అవసరమైన చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. పల్లె, పట్టణ దవాఖానలను ఏర్పాటు చేసి ప్రజల చెంతకే వైద్యాన్ని తీసుకొచ్చింది. ఈ దవాఖానలకు అవసరమైన అని రకాల సౌకర్యాలను సమకూర్చుతున్నది. జిల్లావ్యాప్తంగా మరింత మంది సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో ‘ఎంఎల్హెచ్పీ’ సేవలను అదనంగా కల్పించనున్నది. ‘మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్’ పోస్టులను అదనంగా జిల్లాకు మరో 50ని మంజూరు చేస్తూ ఆరోగ్య శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో సైతం అదనంగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. బస్తీ, పల్లె దవాఖానల్లో ఎంఎల్హెచ్పీల సేవలు అవసరం కానున్నాయి. ఈ దవాఖానల్లో ఓపీతో పాటు అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. రక్త నమూనాలను సేకరించి టి డయాగ్నస్టిక్స్ కేంద్రాలకు పంపి పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా చికిత్స, మందులను అందజేయనున్నది.
అదనంగా మరో 50 పోస్టులు..
రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవాఖానలకు మొదటి విడుతలో భాగంగా 1,569 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ సర్వీసెస్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులను తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జిల్లావ్యాప్తంగా నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరో 1,492 మంది ఎంఎల్హెచ్పీ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నది. రంగారెడ్డి జిల్లాకు పల్లె దవాఖానల్లో 50 మంది సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లా వ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వాటి పరిధిలో మరికొన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు సైతం పని చేస్తున్నాయి.
అర్బన్ ఏరియాలో ఆరోగ్య కేంద్రాలు..
జిల్లాలోని పలు పట్టణ కేంద్రాల్లో ఇప్పటికే 21 యూపీహెచ్సీ కేంద్రాలు పని చేస్తున్నాయి. రెండు సామాజిక (కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్) ఆరోగ్య కేంద్రాలు సైతం పని చేస్తున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా వైద్య ఆరోగ్య సేవలు అదనంగా కావాల్సి ఉన్నందున ప్రభుత్వం మరో తొమ్మిది పట్టణ ఆరోగ్య కేంద్రాలను జిల్లాకు మంజూరు చేసింది. జిల్లాలోని పలు పట్టణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిని శేరి లింగంపల్లిలో రెండు, బాలాపూర్ మండలంలో మూడు, బండ్లగూడ జాగీర్లో 1, షాద్నగర్లో 1, మరో రెండు కేంద్రాలను ఇంకా కేటాయించాల్సి ఉన్నది.
సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం..
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వసతులు మెరుగుపడ్డాయి. ఆయా పెద్ద దవాఖానలలో ఒత్తిడిని తగ్గించేందుకు గాను పల్లె, బస్తీ/పట్టణ దవాఖానలు ఏర్పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే చక్కటి వైద్యం లభిస్తే ప్రజలు పట్టణాలు, నగరాలకు, పెద్ద ఆసుపత్రులకు పరుగులు తీసే బాధ నుంచి విముక్తి పొందుతారు.
– వెంకటేశ్వర్ రావు, జిల్లా వైద్యాధికారి, రంగారెడ్డి జిల్లా