వికారాబాద్, డిసెంబర్ 10, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాదికి నాటాల్సిన మొక్కలకు సంబంధించి వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలతోపాటు అటవీ శాఖ ఆధ్వర్యంలోని 10 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. గతేడాది నాటిన అనంతరం 25 లక్షల మొక్కలు ఇంకా నర్సరీల్లో ఉన్న దృష్ట్యా ఈసారి నాటనున్నారు. ఈ ఏడాది కూడా అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మొక్కలను నాటిన అనంతరం విస్మరించడం కాకుండా ప్రతీ మొక్కను బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనున్నది. గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతీ మొక్కకు జియోట్యాగింగ్ చేయనున్నారు. ప్రధానంగా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్దితోపాటు పూలు, పండ్ల మొక్కలను నాటేందుకు ప్రాధాన్యతనివ్వనున్నారు. జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలోని ఖాళీ స్థలాలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు, సంబంధిత ప్రాంతాల్లో ఔషధ మొక్కలను నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. గతేడాది నాటిన మొక్కల్లో 90 శాతానికిపైగా మొక్కలు బతకడంతో ఈ దఫా మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. ఆకు పచ్చని తెలంగాణగా మార్చేందుకుగాను సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది లక్ష్యం 65 లక్షల మొక్కలు..
తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను 65 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఏయే మండలంలో ఎన్ని మొక్కలను నాటాలనే దానిపై సంబంధిత అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు పల్లెప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతివనాల్లో మొక్కలు నాటేందుకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, బొప్పాయి, మునగ, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ప్రతీ గ్రామంలో 40 వేల మొక్కలను నాటేలా ప్లాన్ను సిద్ధం చేశారు. గ్రామాల్లో జామ, కరివేపాకు, దానిమ్మ, పప్పాయ, పూల మొక్కలైన గులాబీ, మందారం, మల్లె మొక్కలతోపాటు గ్రామం పరిధిలో వివిధ మొక్కలను నాటనున్నారు. ఏయే మొక్కలను నాటాలన్నదానిపై గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేయనున్నారు.
అనంతగిరి అటవీ ప్రాంతంలో లక్ష మొక్కలు..
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని ఖాళీలపై దృష్టి సారించామని, అనంతగిరి అటవీ ప్రాంతాల్లోని ఖాళీల్లో లక్ష ఔషధ మొక్కలను నాటేందుకు నిర్ణయించామని జిల్లా అటవీ శాఖ అధికారి డి.వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా నర్సరీల్లో ఔషధ మొక్కలను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా హరితహారంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించడంతోపాటు జియోట్యాగింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
– డీ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి