యాచారం, నవంబర్ 24 : విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి అన్నారు. మండలంలోని గున్గల్ గ్రామంలో ఉన్న ఆదర్శ పాఠశాలను గురువారం ఆమె సందర్శించారు. పాఠశాల తరగతి గదులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. మధ్యాహ్న భోజనంలో అవకతవకలు ఉండొద్దన్నారు. వసతిగృహంలో ఉంటున్న బాలికలకు అన్ని రకాల వసతులను కల్పించాలన్నారు. ఆదర్శ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎమిమా పాల్గొన్నారు.