రంగారెడ్డి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సంప్రదాయ పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, పెసర్లు, కందులు, వేరుశనగ, పత్తి, చెరుకు మాదిరిగానే ‘ఆముదం’ పంటను కూడా రైతులు పండిస్తున్నారు. ప్రత్యేక ఔషధ గుణాలున్న ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్, రబీ కాలాల్లో కలుపుకొని మొత్తం 888 ఎకరాల్లో సాగు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం వ్యవసాయ ప్రణాళికలో పేర్కొంది. వానకాలంలో ఆముదం పంటను 50 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాధారం కింద 3-4 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 12 క్వింటాళ్ల దిగుబడిని పొందే అవకాశముంది. మార్కెట్ ధర క్వింటాల్కు రూ.6,500 ఉంది.
యాసంగిలో ఇప్పటికే 52 ఎకరాల్లో..
నీటి వసతిని బట్టి ఈ పంటను వానకాలం, యాసంగి కాలాల్లో సాగు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. నీరు ఇంకిపోయే అన్ని నేలలు ఈ పంటలకు అనుకూలం. ఈ పంటలు పండించే నేలను రెండు నుంచి మూడుసార్లు దున్ని, గుంటుకతో చదును చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పంట 120 నుంచి 180 రోజుల్లో చేతికి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఆమనగల్లు మండలంలో 52 ఎకరాల్లో ఆముదం పంట సాగయ్యింది. ఇంకా పెద్దమొత్తంలో పంట సాగు చేపట్టాల్సి ఉంది. రబీ కాలం ఇప్పటికే మొదలైన దరిమిలా ఆముదం విత్తనాలను పటిష్ట కార్యాచరణతో విత్తుతున్నారు. మొదటి వారం నుంచే ఆముదపు పంటను సాగులోకి తేవడంతో అధిక దిగుబడిని సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ నిపుణులు చెబుతున్నారు. విత్తడం ఆలస్యమైతే దిగుబడి సైతం తగ్గుముఖం పట్టనుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మిగతా పంటలతో పాటే.. ఈ పంటలకు కూడా పంటలకు సంబంధించిన పలు పథకాలు, స్కీములు వర్తిస్తున్నాయి. ఈ పంటను ఆరుతడిలో భాగంగా పండించాల్సి ఉంటుంది. పెద్దగా శ్రమించాల్సిన అవసరంలేదు. అయినా, రైతులు వరి పైరుపైనే ఆసక్తి చూపుతున్నారు.
రైతులు సందేహాలను నివృత్తి చేసుకోవాలి
రైతులు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులను కలుసుకోవచ్చు. హెక్టారుకు 5 నుంచి 7 కిలోలు, సంకర జాతి అయితే, 5 కిలోల విత్తనం వాడాలి. విత్తనాలను నాటే ముందు విత్తన శుద్ధి చేపట్టాలి. దీంతో ఆకుపచ్చ తెగులు, మొలక కుళ్లు తెగులు, కొంతవరకు వడలు తెగుళ్లను నివారించవచ్చు. 90 సెం.మీ. దూరంలో విత్తనాలను నాటుపెట్టాలి. హెక్టారుకు 5 టన్నుల పశువుల ఎరువును వాడాలి. నత్రజని, భాస్వరం, పొటాష్లను తగినంతగా వాడాలి. ఆముదం పంటతో కంది, బొబ్బర్లు, పెసర్లు, మినుములు, వేరుశనగ, గోకర, ఉలువలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. విత్తనాలు నాటిన 60 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి. ఎర్ర గొంగళి పురుగు, దాసరి పురుగు, నామాల పురుగులు పంటను ఆశ్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి