షాద్నగర్టౌన్, నవంబర్ 24: ప్రభుత్వం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. షాద్నగర్ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు సంబంధించిన వివరాలను మండల వ్యవసాయాధికారి నిశాంత్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. అదే విధంగా రైతులు తాము పండించిన ధాన్యానికి సంబంధించిన తేమ శాతం 17శాతానికి మించి ఉండొద్దని రైతులకు వివరించారు. అనంతరం ధాన్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు తేజ్కుమార్, ప్రణీత, నిఖిల్రెడ్డి, పీపీసీ ఇన్చార్జి హరికృష్ణ, రైతులు పాల్గొన్నారు.