మొయినాబాద్, నవంబర్ 22 : ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేసి ప్రజలకు పుష్కలంగా సురక్షిత తాగునీటిని అందిస్తున్నదని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రెడ్డిపల్లి, మోత్కుపల్లి, చందానగర్ గ్రామాల్లో పర్యటించారు. ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి రెడ్డిపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, మండల పరిషత్ నిధులు రూ.6 లక్షలతో నిర్మించిన అంతర్గత మురుగు కాలువను ప్రారంభించారు. గ్రామానికి అదనంగా ఆర్టీసీ బస్ సర్వీస్లను ఏర్పాటు చేయడంతో బస్ సర్వీస్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మోత్కుపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు వివిధ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి కృష్ణానది నీళ్లను మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తున్నారని చెప్పారు. మహిళలు నీటి కోసం వ్యవసాయ బావుల వద్దకు పరుగులు తీయాల్సిన కష్టం తప్పిందని గుర్తు చేశారు. గతంలో విద్యుత్, మంచినీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, అట్టి సమస్యలకు సీఎం పరిష్కారం చూపించారన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో సంధ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు బి వినీత, కె రత్నం, సత్తమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జి జయవంత్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, డైరెక్టర్లు కె రాము, రాజు, భిక్షపతిగౌడ్, మహేశ్, ఎంపీటీసీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.