రంగారెడ్డి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని(3 డిసెంబర్, 2022) పురస్కరించుకొని జిల్లాస్థాయి ఆటల పోటీలు (ఈ నెల 24, 25 తేదీల్లో) రెండు రోజుల పాటు సరూర్నగర్ గ్రౌండ్స్లో జరుగనున్నాయని జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి ఎన్.మోతీ పేర్కొన్నారు. ఆసక్తి గల దివ్యాంగులు ఉదయం 9 గంటలకు రావొచ్చని అధికారి తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరికీ జూనియర్స్ (10 నుంచి 16 సంవత్సరాలు), సీనియర్స్ (17 నుంచి 54 సంవత్సరాలు) విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందినవారు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు దివ్యాంగ సదరం, ఆధార్ కార్డు తీసుకొని రావాల్సిందిగా అధికారి తెలిపారు. అంధులకు రన్నింగ్, షాట్ఫుట్, చెస్, జావెలిన్ త్రో, బధిరులకు రన్నింగ్, షాట్ఫుట్, క్యారమ్స్, జావెలిన్ త్రో, శారీరక దివ్యాంగులకు రన్నింగ్, చెస్, షాట్ఫుట్, జావెలిన్ త్రో, వీల్ చైర్/ట్రై సైకిల్ రేస్, క్యారమ్స్, బుద్ధి మాంద్యం గలవారు రన్నింగ్, చెస్, షాట్ఫుట్, క్యారమ్స్ ఆటల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్, నవంబర్ 22 : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 24, 25 తేదీల్లో స్త్రీ, పురుషుల దివ్యాంగులకు స్థానిక బ్లాక్ గ్రౌండ్లో ఉదయం 11 గంటలకు ఆటల పోటీలు నిర్వహిస్తారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10 నుంచి 16 సంవత్సరాల వారు జూనియర్లుగా, 17 నుంచి 54 సంవత్సరాలవారు సీనియర్లుగా రెండు విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దృష్టి, వినికిడి, శారీరక, మానసిక, దివ్యాంగులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. రన్నింగ్, షాట్ఫుట్, చెస్, క్యారమ్స్, వీల్ చైర్స్, జావెలిన్ త్రో, ట్రై సైకిల్ రేస్ లాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో మొదటి, రెండో స్థానాలు సాధించిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.