పరిగి, నవంబర్ 22: వ్యవసాయానికి అనుబంధంగా మల్బరీ సాగుతో పట్టు పురుగుల పెంపకం ద్వారా రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు సెరికల్చర్ అధికారు లు కార్యక్రమాలను చేపడుతున్నారు. మల్బరీ తోటల సాగుకు అనువైన వికారాబాద్ జిల్లాలో వచ్చే ఏడాదికి మల్బరీ సాగు విస్తీర్ణం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 300 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. సుమారు 150 మంది రైతులు వ్యవసాయానికి అనుబంధంగా మల్బరీ తోటలను పెంచి పట్టు పురుగుల పంపకాన్ని చేపడుతున్నారు. 2022-23 సంవత్సరంలో కొత్తగా 84 ఎకరా ల్లో మల్బరీ సాగును చేపట్టడం జరిగింది.
వచ్చే ఏడాది 300 ఎకరాల్లో పెంపునకు చర్యలు
జిల్లాలో 2023-24 సంవత్సరంలో రైతులు అదనంగా 300 ఎకరాల్లో మల్బరీ సాగును చేపట్టేలా సెరికల్చర్ అధికారులు చర్య లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 300 ఎకరాల్లో మల్బరీతోటలు సాగులో ఉండగా, రెట్టింపు చేయడం ద్వారా పట్టు పురుగుల పెంపకంపై రైతులు ప్రత్యేక శ్రద్ద చూపించేలా వారికి ఇప్పటి నుంచే అవగాహన కల్పిస్తున్నారు. ఏడాది పొడవునా పట్టుపురుగుల పెంపకంతో లాభాలను ఆర్జించొచ్చని సూచిస్తున్నారు. జిల్లాలో మల్బరీ తోటల సాగును విస్తరించేందుకు అధికారులు ఇటీవల ఎంపిక చేసిన కొంతమంది రైతులను సిద్దిపేట జిల్లా చంద్లాపూర్లో మల్బరీ సాగు క్షేత్రాల సందర్శనకు తీసుకెళ్లారు. అక్కడి రైతులు మల్బరీ సాగుతోపాటు పట్టు పురుగుల పెంపకంపై జిల్లా రైతులకు మరింత అవగాహన కల్పించారు. తాము ఎలా మల్బరీ సాగుతోపాటు పట్టు పురుగుల పెంపకాన్ని చేపడుతున్నామో పూర్తిస్థాయిలో రైతులు వివరించారు. శాస్త్రవేత్త ప్రవీణ్కుమార్ సైతం రైతులకు మల్బరీ సాగుపై అవగాహన కల్పించారు.
జిల్లాకు 51 షెడ్లు మంజూరు
పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి వికారాబాద్ జిల్లాకు 51 షెడ్లు మంజూరయ్యాయి. ఒక్కో షెడ్డు అంచనా వ్యయం రూ. 4 లక్షలు ఉండగా, వాటిలో ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, బీసీ, ఇతరులకు 50శాతం సబ్సిడీ అందిస్తున్నారు. మంజూరైన షెడ్లలో ఇప్పటివర కు 30 షెడ్ల నిర్మాణం పూర్తి కాగా డబ్బులు సైతం రైతులకు అధికారులు పంపిణీ చేశారు. ఇందులో మొక్కలు నాటేందుకు రూ.25 వేలు, సెల్ఫ్ రేరింగ్కు రూ. 12 వేలు, షెడ్డు నిర్మాణానికి రూ.2 లక్షలు అందిస్తారు. మిగతాది రైతు లు బ్యాంకులో రుణం లేదా సొంత డబ్బులు వెచ్చించి చేపట్టాల్సి ఉం టుంది. ఇదిలా ఉండగా జిల్లాలో సెరికల్చర్ విస్తరణ కోసం షెడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరో 100 షెడ్లు అవసరమైనా మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం మరింత విస్తరించనున్నది.
రూ.2లక్షల వరకు ఆదాయం
ఒక ఎకరంలో మల్బరీ తోట సాగు ద్వారా పట్టు పురుగులను పెంచితే ప్రతి ఏడాది రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుందని సెరికల్చర్ అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్లోని తిరుమలగిరి మార్కెట్లో పట్టుకాయలు కిలో రూ.500 నుంచి రూ. 700 వరకు లభిస్తాయని.. ప్రతి ఏడాది నాలుగు నుంచి ఐదు దఫాలుగా పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టొచ్చని పేర్కొంటున్నారు. పెట్టుబడి, ఇతర ఖర్చులు పోను మంచి ఆదాయం వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అందువల్ల రైతులను మల్బరీ సాగు వైపు దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీటి వసతి ఉన్న రైతులకు మంచి ఆదాయ వనరుగా ఈ పంటను చెప్పవచ్చని.. కేవలం కుటుంబసభ్యులే పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టవచ్చొని అధికారులు పేర్కొంటున్నారు
అదనంగా 300 ఎకరాల్లో మల్బరీ సాగు
జిల్లాలో ప్రస్తుతం 300 ఎకరాల్లో మల్బరీ సాగు చేపడుతున్నారు. ఒక్కో రైతు కనీసం రెండు ఎకరాల్లో మల్బరీ తోటలను సాగు చేసి పట్టు పురుగుల పెంపకాన్ని చేపడుతున్నారు. 2023-24లో అదనంగా మ రో 300 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటు న్నాం. ఇందుకోసం కొంతమంది రైతులను ఎంపిక చేసి అవగాహన కల్పిస్తున్నాం. ఒక ఎకరంలో మల్బరీ సాగుతో పట్టు పురుగుల పెంపకం ద్వారా ఏడాది రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఆదాయాన్ని పొందొచ్చు.
– మల్లికార్జున్, ఏడీ, సెరికల్చర్