పుట్టిన రోజు, పెండ్లి, సన్మానాలు, విందులు.. వేడుకేదైనా పూల వినియోగం తప్పనిసరి. పూలు ఇంటికి ఇంపును కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. రంగారెడ్డి జిల్లా రైతులు సంప్రదాయ పంటలను పక్కన పెట్టి, పూల తోటల సాగుతో లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియో గం చేసుకుంటూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని తీస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. గతేడాది జిల్లాలో 6,285 ఎకరాల్లో చామంతి, గులాబీ, బంతి, మల్లె, లిల్లీ తదితర పూల తోటలను సాగు చేయగా.. 42,035 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. పెట్టిన ఖర్చులు పోను మూడింతల లాభాలొచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. గతేడాది జిల్లాలో చామంతి వెయ్యి ఎకరాల్లో, గులాబీ 800, బంతి 600 ఎకరాల్లో సాగైనది. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు జిల్లాలో 3,110 ఎకరాల్లో పూల తోటలు సాగు అయ్యాయి. రబీ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పూల తోటలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని చేవెళ్ల డివిజన్లో 1,868 ఎకరాలు, షాద్నగర్లో 500 , కందుకూరులో 730, ఇబ్రహీంపట్నం డివిజన్లో 12 ఎకరాల్లో వివిధ రకాల పూల తోటలు సాగవుతున్నాయి.
రంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహా నగరాన్ని ఆవరించి ఉన్న ప్రధానమైన రియల్ ఎస్టేట్ హబ్ రంగారెడ్డి జిల్లా. వ్యవసాయానికి కూడా పెట్టింది పేరు. గత కరోనా కాలంతో దెబ్బతిన్న రైతులు సంప్రదాయ పంటలను పక్కన పెట్టి, పూల సాగుతో లాభాల బాటలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడిని తీస్తూ జిల్లా రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. పూల సాగు నిమిత్తం జిల్లా ఉద్యాన వన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ రైతులు పురోగమనం దిశగా అడుగులు వేస్తున్నారు. పూల సాగులో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రాయితీలను అందిపుచ్చుకుంటూ వివిధ రకాల పూల పంటలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో వానకాలం(ఖరీఫ్), యాసంగి(రబీ) కాలాల్లో మొత్తం 6,285 ఎకరాల్లో పూల సాగు చేస్తున్నారు. పూలల్లో ‘బంతి, చామంతి, జరబర, గులాబీ, మల్లె, లిల్లీ, సంపెంగ, విరజాజి’ లాంటివి అనేకం ఉన్నాయి. ఈ పూల పంటలకు హైదరాబాద్ నగరమే అతి పెద్ద మార్కెట్. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కలనున్న ప్రతి పట్టణంలో వేడుకలు అత్యంత కళాత్మకంగా జరుగుతున్నాయంటే.. అందుకు ప్రధాన ఆదెరువు రంగారెడ్డి జిల్లాలోని పూల వికాసమేనని సగర్వంగా చెప్పుకోవచ్చు.
గతేడాది.. పూల దిగుబడి
గత కరోనా కాలంలో డిమాండ్ లేక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఆ కాలం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే రైతులు కోలుకుంటున్నారు. జిల్లాలో గతేడాది (2021-22) ఖరీఫ్ కాలంలో 3,063 ఎకరాలు, రబీ కాలంలో 3,222 ఎకరాల్లో పూల సాగు చేశారు. 42,035 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. పూల సాగుపై ఖర్చు చేసిన దానికంటే మూడింతలు లాభాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది (2022-23) ప్రస్తుతం, ఖరీఫ్ పంట కాలం కొనసాగుతున్నది. జిల్లాలో 3,100 ఎకరాల్లో పూల పంటల సాగు కొనసాగుతున్నది. ఖరీఫ్ కాలం ఇప్పుడిప్పుడే షురూ కానుంది. జిల్లాలోని ఐదు డివిజన్లలోని రాజేంద్రనగర్ మినహా, మిగతా చేవెళ్ల, షాద్నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నంలలో పూల సాగు కొనసాగుతుంది. చేవెళ్ల డివిజన్లో 1868 ఎకరాలు, షాద్నగర్లో 500 ఎకరాలు, కందుకూరులో 730 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో కేవలం 12 ఎకరాల్లో వివిధ రకాల పూల సాగు కొనసాగుతున్నది. ఈ ఏడాది పూల దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
వెయ్యి ఎకరాల్లో చామంతి సాగు..
జిల్లాలో పలు రకాల పూల పంటలను రైతులు ఎంతో ఆసక్తిగా, అధిక దిగుబడి వచ్చేలా పలు జాగ్రత్తలు తీసుకుంటూ, వేళకు ఎరువులు వేస్తూ సాగు చేస్తున్నారు. రైతులు వారి సందేహాలను అధికారులతో నివృత్తి చేసుకుంటున్నారు. జిల్లాలో చామంతి 1000 ఎకరాలు, గులాబీ 800, బంతి 600, జరబర 50, లిల్లీ – 170 ఎకరాలు, మల్లెపూలు, కనకాంబరాలు, ఇంకా అనేక రకాల పూల సాగు కూడా కొనసాగుతుంది. చామంతి ఎకరానికి 10 నుంచి 12 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, బంతి 6 నుంచి 8 టన్నులు, గులాబీ 2 టన్నుల దిగుబడి వస్తున్నదని రైతులు చెబుతున్నారు.
పంట సాగులో సలహాలు తీసుకోండి..
పూల పంట సాగులో మిగతా పంటల మాదిరిగా రైతులు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దు. పూలల్లోని పలు రకాల పంటల నుంచి అధిక దిగుబడులు తేవాలి. లాభాలు గడించాలంటే ప్రతి రైతు సాగు కాలంలో అధికారులు, నిఫుణులు నిర్దేశించిన ప్రకారం, ఎరువులను, నీటిని వినియోగించాలి. ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి. ఏమైనా సందేహాలు ఉంటే, మా వద్దకు వచ్చి, లేదా గ్రూపులలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మొక్కల నాటు నుంచి పూలు కాతకు వచ్చే వరకు ఏయే సమయంలో ఏమి చేయాలనే దానిపై ప్రతి రైతు స్పష్టత కలిగి ఉండాలి. అప్పుడే ఆశించిన రీతిలో దిగుబడితో పాటు లాభాలు వస్తాయి.
– ఎన్.సునందారాణి, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి
చన్వెల్లి జరబరకు కేరాఫ్ అడ్రస్..
చన్వెల్లి పాలీహౌస్లకే కాకుండా జరబర ఫ్లవర్స్ పెంపకానికి కేరాఫ్ అడ్రస్. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పాలీహౌస్లలో జరబర పువ్వులనే ఎక్కువగా పండిస్తారు. జరబర పూల అందమే వేరు. ఇండ్లు, ఫంక్షన్ హాళ్లలో ఏ కార్యము జరిగినా వీటిదే ప్రత్యేక అలంకరణ. రంగారెడ్డి జిల్లాకు చెందిన చన్వెల్లిలో పదుల సంఖ్యలో రైతులు వీటి సాగు చేస్తున్నారు. ఒక్కసారి ఈ మొక్కలను నాటితే, దాదాపు ఎనిమిదేండ్లకు పైగానే ఈ మొక్కలు సేవలందిస్తాయి. ఏడాది పొడవునా వచ్చే ఈ పూలకు ఎండా కాలంలోనే చాలా డిమాండ్ ఉంటుంది. మూడెకరాలలో ఈ పూల సాగు చేపట్టిన. చాలా ఖర్చుతో కూడుకున్న పంట ఇది. జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాలు కూడా అంతే ఉంటాయి.
– కె.యాదయ్య, రైతు, చన్వెల్లి గ్రామం
మిగతా పంటల కంటే.. పూల పంటే సులువు
నాకున్న మూడెకరాలలో చామంతి పూల సాగు చేస్తున్న. పూల సాగుకు మా భూమి అనుకూలంగా ఉంది. మంచి దిగుబడి వస్తుంది. మా ఊరి నుంచి హైదరాబాద్ నగరానికి తరలించేందుకు రవాణా సౌకర్యం ఉంది. సిటీలో పూలకు మంచి గిరాకీ ఉంది. అందుకే ప్రతి రెండు, మూడు రోజులకు ఓసారి నగర మార్కెట్లకు పూలను తరలిస్తా. ఏటేటా పూల సాగు చేస్తం. ఎక్కువ దిగుబడి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటం. మిగతా సంప్రదాయ, సంప్రదాయేతర పంటలతో పోల్చుకుంటే పూల సాగు సులువుగా ఉంటుంది. దీని ద్వారా గిట్టుబాటు కూడా బాగానే ఉంది.
– కొండకల మల్లేశ్, ఆలూరు, చేవెళ్ల
కొన్నేండ్లుగా పూల సాగు చేస్తున్న..
గత కొన్నేండ్లుగా పూల సాగు చేస్తున్న. ఇప్పుడు చామంతి, బంతి, జరబర పూల పంటలను సాగు చేస్తున్న. పూల సాగులో పంట వేసే మొదట్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలె. ఆ తరువాత అధికారులు చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఎరువులు, నీళ్లు పెట్టాలె. పూల దిగుబడి ఎక్కువగా వచ్చేందుకు రోజులవారీగా పంట ఎదిగేందుకు జాగ్రత్తలు పాటించాలె. పూలు మంచిగ ఎదిగినంక నెమ్మదిగా కోతకు పెట్టాలె. కోసిన పూలను నగరంలోని గుడి మల్కాపూర్ పూల మార్కెట్కు తరలిస్తం. మిగతా పంటల కన్నా పూల సాగు మంచి లాభదాయకంగా ఉంటుంది. అందుకే కొన్నేండ్లుగా పూల సాగునే చేస్తున్న.
– నీరటి కిష్టయ్య, రైతు, నర్సప్పగూడ, షాద్నగర్