ఆదిబట్ల, నవంబర్ 21: అంగన్వాడీ టీచర్ల పనితీరును మరింత మెరుగుపర్చేందుకు.. వారి సేవలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందుతున్న పౌష్టికాహారం వివరాలను రోజువారీగా ఎప్పటిప్పుడు ఎంట్రీ చేసేందుకు న్యూట్రిషియన్ అండ్ హెల్త్ట్రాకింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్-9) అనే ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్నది. దీని ద్వారా అంగన్వాడీ టీచర్ల కార్యకలాపాలన్నీ కాగితం లేకుండానే జరుగనున్నాయి. సెల్ఫోన్లోనే పూర్తి సమాచారం నిక్షిప్తం కానున్నది.
ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 15 రకాల రిజిస్టర్లను అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తుంటారు. ఈ రిజిస్టర్లలో వారు రోజువారీ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా వారిపై పని భారం పడుతుంది. దీని ద్వారా చిన్నారులకు ఆట, పాటలతో నేర్పించాల్సిన విద్య గాడితప్పుతుంది. అయితే ఈ ప్రత్యేక యాప్తో అంగన్వాడీల పనిభారం తగ్గనున్నది. ప్రతి అంశాన్నీ సెల్ఫోన్ ద్వారానే సంబంధిత అధికారులను పంపించనున్నారు. పౌష్టికాహార లోపంతో చిన్నారులు ఉం డొద్దనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది.
గర్భిణులు తీసుకునే సమతుల ఆహారంతోనే జన్మించనున్న శిశు వు ఆరోగ్యం, బరువు ఆధారపడి ఉంటుంది. బాలింతలతోపాటు శిశువు ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండాలని చిన్నారులకు ఆరేండ్లు వచ్చే వరకు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. కిశోర బాలికలకు కూడా పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రతి చిన్నారీ ఎత్తు, బరువు, భుజం చుట్టు కొలతలను తీసుకుని.. వయస్సుకు తగిన ఎత్తు, బరువు ఉన్నారా లేదా అనే వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో ఎంట్రీ చేస్తారు. పోషకాహార లోపం ఉన్నట్లు గమనిస్తే వారికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని పంపిణీ చేస్తారు.
అంతా యాప్లోనే..
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 63 సెక్టార్లలో మొత్తం 1,600 కేంద్రాలుండగా అందులో ఆరేండ్లలోపు చిన్నారులు 1,37, 193 మంది ఉన్నారు. అలాగే గర్భిణులు 7,311 మంది, బాలింతలు 6,614 మంది లబ్ధిదారులుగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదై ఉన్నారు. ప్రస్తు తం ప్రతి కేంద్రానికీ వచ్చే లబ్ధిదారుల వివరాలతోపాటు వస్తు న్న సరుకులు, వినియోగం తదితర అంశాలను 15 రకాల రిజిస్టర్లలో అంగన్వాడీ టీచర్లు ఎంట్రీ చేస్తున్నారు. గర్భిణు లు, బాలింతలు, కౌమర దశలోని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ, సిబ్బంది హాజరు, చిన్నారుల పెరుగుదల, ఆహార నిల్వలు, టీకాల పంపిణీ, పలు రకాల వివరాలు ఎప్పటికప్పుడు ఈ యాప్లో నమోదు అవుతాయి. అంతేకాకుండా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరుగడంతో సేవలు పారదర్శకంగా అందుతున్నాయి.
ఇప్పటికే శిక్షణ పూర్తి…
రికార్డులకు సంబంధించిన అన్ని అంశాలతో ఎన్హెచ్టీఎస్-9(న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం) పేరుతో ప్రత్యేక యాప్ను అధికారులు రూపొందించారు. దీనిలో 15 రికార్డులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపర్చారు. ఈ యాప్ను ఎలా వినియోగించాలో ఇటీవలే జిల్లాలోని సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు మూడు రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. భవిష్యత్తులో బరువు తక్కువ ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేకమైన పౌష్టికాహారం కూడా సరఫరా అయ్యే అవకాశం ఉన్న ది. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎఫ్పీ అనే మరో యాప్ను కూ డా అధికారులు రూపొందించారు. కాగా డిసెంబర్ నెల నుంచి ఈ యాప్ సేవలు ప్రారంభం కానున్నాయి.
ఈ యాప్తో మరింత పర్యవేక్షణ
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్తో పర్యవేక్షణ మరింత పెరుగనున్నది. ఈ యాప్ను ఎలా వినియోగించాలో జిల్లాలోని సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు మూడు రోజులపాటు శిక్షణ కూడా పూర్తైంది. సిబ్బంది విధులు, రికార్డుల నిర్వహణ, సరుకుల పంపిణీ తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
-మోతీ, స్త్రీ, శిశు సంక్షేమాధికారి రంగారెడ్డి జిల్లా