శంకర్పల్లి, నవంబర్ 19 : ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికే శుభోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామం లో శుభోదయం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధ్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు కొత్త కళ వచ్చిందన్నారు. రైతుల సంక్షేమానికి రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతన్నకు అండగా నిలుస్తున్నారని అన్నారు. సమాజంలో దళితులు ఆర్థికంగా ఎదగాలని దళితబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, సర్పంచ్ పావని హన్మంత్రెడ్డి, మండల, మున్సిపల్ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, ఉపాధ్యక్షులు రాఘవేందర్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అభివృద్ధ్దికి కృషి
నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. శనివారం మున్సిపాలిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలను కేటాయిస్తున్నదని తెలిపారు. చైర్ పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్ కుమార్ మాట్లూడుతూ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు రూ. 3.37 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మిషన్ భగీరథ నీటికి వారం రోజులు అంతరాయం కలగడంతో నీటి ట్యాంకర్లతో సరఫరా చేస్తామని తెలిపారు. వివిధ సమస్యలపై చర్చించారు. సమావేశంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.